
ఇస్లామాబాద్: 26/11 ముంబై ఉగ్రదాడుల ప్రధాన నిర్వాహకుడు సాజిద్ మజీద్ మీర్కు పాకిస్తాన్ కోర్టు 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. 2008 ముంబై దాడుల ప్రధాన హ్యాండ్లర్ అయిన నిషేధిత లష్కరే తోయిబా (ఎల్ఇటి) కార్యకర్త సాజిద్ మజీద్ మీర్కు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో పాకిస్తాన్లోని యాంటీ టెర్రరిజం కోర్టు ఈ శిక్ష విధించింది.
పంజాబ్ పోలీస్కి చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ దర్యాప్తు చేసిన ఈ కేసులో జైలులో జరుగుతున్న ఇన్-కెమెరా ప్రొసీడింగ్ కావడంతో మీడియాను అనుమతించలేదు. మీర్ ఈ ఏప్రిల్లో అరెస్ట్ అయినప్పటి నుంచి కోట్ లఖ్పత్ జైలులో ఉన్నారని న్యాయవాది తెలిపారు.
కోర్టు దోషికి రూ.4,00,000 జరిమానా కూడా విధించిందని న్యాయవాది చెప్పారు.166 మందిని పొట్టనబెట్టుకున్న 26/11 ముంబై దాడుల్లో సాజిద్ మీర్ భారతదేశం మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. మీర్ను ముంబై దాడులకు ప్రాజెక్ట్ మేనేజర్ అని పిలిచేవారు.
మీర్ 2005వ సంవత్సరంలో మారు పేరుతో నకిలీ పాస్పోర్ట్ను ఉపయోగించి భారతదేశాన్ని సందర్శించినట్టు సమాచారం. సాజిద్ మజీద్ మీర్ తలపై అమెరికాలో 50 లక్షల డాలర్ల నజరానా ఉంది.
Source: Nijamtoday



