
ముంబై: పార్టీ ఎమ్యెల్యేలలో మూడింట రెండు వంతుల మందికి పైగా తిరుగుబాటు శిబిరంలో చేరినట్టు స్పష్టం కావడంతో అధికారం చివరి ఘడియలలో పడినదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే గ్రహించారు. తిరుగుబాటు ఎమ్యెల్యేలు కొందరిపై అనర్హత అస్త్రం ప్రయోగించి, వివాదాన్ని కోర్ట్ వరకు తీసుకెళ్లి, కొంతకాలం నెట్టుకొచ్చే ఎత్తుగడలు వేస్తున్నారు.
అయితే పార్టీపై పట్టు కోసం ఇప్పుడు థాకరేతో పాటు తిరుగుబాటు నేత ఎకనాథ్ షిండే సహితం ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమదే అసలైన శివసేన అంటూ ఎవరికి వారే ప్రకటనలు చేస్తున్నారు. తనను శాసనసభాపక్ష నేతగా నియమించాలంటూ 37 మంది శివసేన ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలను డిప్యూటీ స్పీకర్, గవర్నర్కు షిండే ఇప్పటికే పంపారు.
ఇక పార్టీని చీల్చేందుకు తిరుగుబాటు నాయకులు కుట్ర పన్నారని సీఎం ఉద్ధవ్ ఆరోపించారు. పార్టీని విడిచిపోయే వారి కోసం తాము బాధపడనని, ఎవరు వెళ్లిపోయినా తమకు నష్టం లేదని చెప్పారు. కుళ్లిన పళ్లు, ఆకులు రాలిపోతేనే మంచిదని, వేళ్లూనుకున్న మహావృక్షం లాంటి శివసేను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.
Source: Nijamtoday





