
-
నారద జయంతిలో ఆర్.ఎస్.ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీనివాసులు
నెల్లూరు: వృత్తినే దైవంగా భావించి, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సమ సమాజం కోసం వార్తలు సేకరించడంలో పాత్రికేయులు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలు ప్రశంసనీయమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్.ఎస్.ఎస్) ప్రాంత ప్రచార ప్రముఖ్ బయ్యా శ్రీనివాసులు(వాసు) అన్నారు.
స్థానిక కృష్ణచైతన్య కళాశాలలో ప్రచార విభాగం ఆధ్వర్యంలో గురువారం దేవర్షి నారద జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రధాన వక్తగా హాజరైన వాసు మాట్లాడారు. జర్నలిస్టులు కొన్ని చోట్ల ప్రాణాలకు తెగించి, వాస్తవాలు వెలుగులోకి తెచ్చి, పత్రికా విలువలు కాపాడుతున్నారన్నారు. ఇటువంటి సాహవంతులను ఎంపిక చేసి, ప్రతి ఏడాది నారద జయంతిని పురస్కరించుకుని ఘనంగా సత్కరిస్తున్నట్టు తెలిపారు.

ఆర్.ఎస్.ఎస్ క్రమశిక్షణకు మారుపేరని, కీర్తి, ప్రతిష్ఠలకు దూరంగా ఉంటుందన్నారు. సమాజ సేవే ధ్యేయంగా, ఆర్భాటాలకు దూరంగా రాత్రీపగలు అన్న తేడా లేకుండా వ్యక్తి నిర్మాణం ద్వారా దేశభక్తి రగిల్చి, సామాజిక సమరసత కోసం కృషి చేస్తోందని వివరించారు. పాత్రికేయ మిత్రులు ఆర్ఎస్ఎస్ విధానాలను, సిద్ధాంతాలను అర్థం చేసుకొని, సమాజ నిర్మాణానికి తమ వంతు సహాయసహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా పాత్రికేయులను ఘనంగా సత్కరించారు.
నగర సహ సంఘచాలక్ గుర్రం సుధాకర్ మాట్లాడుతూ నారద మహాముని బ్రహ్మ మానస పుత్రునిగా ముల్లోకాలు సంచరించి, దేవతలకు దగ్గరై లోక కల్యాణం కోసం పాటుపడ్డారన్నారు. సమాజ హితం కోసం దుష్ట శిక్షణ, శిష్టరక్షణకు కృషిచేసిన మహోన్నతునిగా కొనియాడారు.

ముఖ్య అతిథి డెక్కన్ క్రానికల్ స్టాఫ్ రిపోర్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పత్రికా రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకొని, స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకుందన్నారు. అంతేకాకుండా స్థానిక పాత్రికేయులు పత్రికా విలువలను కాపాడుతూ ముందు వరుసలో నిలిచారన్నారు.
శ్రీధర్(వార్త), కృష్ణయ్య(ఆంధ్రజ్యోతి), సునీల్(ఎన్3 న్యూస్), వల్లూరు మాధవరావు(జమీన్ రైతు స్వర్ణ సాగరం)లు సత్కారం పొందిన వారిలో ఉన్నారు.
కృష్ణ చైతన్య కళాశాలల కరస్పాండెంట్ చంద్రశేఖర రెడ్డి, జిల్లా ప్రచార ప్రముఖ్ మురళి, జిల్లా సహ కార్యావహ బొందల మల్లికార్జున్, నగర ప్రచార ప్రముఖ్ దోర్నా దులవెంకటేశ్వర్లు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పలువురు స్వయంసేవకులు పాల్గొన్నారు.





