
న్యూఢిల్లీ: తాలిబన్ల వ్యవహారిశైలి వల్ల భారతదేశానికి ముప్పుగా పరిణమిస్తే.. వారిని ఎదుర్కొనేందుకు భారత భద్రతా బలగాలు కసరత్తు ప్రారంభించాయి. ఇందుకోసం కొత్త శిక్షణ ప్రణాళికను రూపొదించాల్సిందిగా సరిహద్దు భద్రతా బలగాలకు, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న పోలీసులకు, ఇతర సాయుధ బలగాలకు కేంద్ర భద్రతా సంస్థ ఆదేశాలు జారీ చేసింది.
అఫ్గానిస్థాన్ను తాలిబన్లు చాలా వేగంగా చేజిక్కించుకున్నారు. ఈ ప్రభావంపై భారత్ సహా చాలా దేశాలపై పడనుంది. గతంలో తాలిబన్లు కశ్మీర్లోకి చొరబడిన సందర్భాలు ఉన్నాయి. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని ఈసారి వారు చెబుతున్నా, ఆ మాటలను నమ్మే పరిస్థితి లేదు. అందుకే తాలిబన్ ముప్పును నివారించేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. వారి పోరాట వ్యూహాలను, అనుసరించే పద్ధతులపై సరిహద్దుల్లో కాపలా కాస్తున్న చివరి సైనికుడికి కూడా అవగాహన కల్పించేలా ప్రణాళిక ఉండాలని అధికారులు భావిస్తున్నారు.





