News

తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతి గుర్తింపు.. ‘క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్’గా నామకరణం

31views

తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో కొత్తగా గుర్తించిన అరుదైన వృక్ష జాతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నామకరణం చేశారు. యూఫోర్బియేసీ (Euphorbiaceae) కుటుంబానికి చెందిన ఈ కొత్త జాతికి ‘క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్’ (Croton Ubbalamadugensis) అని పేరు పెట్టారు.

ఉబ్బలమడుగు జలపాతానికి సమీపంలోని కంబకం కొండల ప్రాంతం ఈ మొక్కకు సహజ ఆవాసంగా ఉండటంతో, ఆ ప్రాంత ప్రత్యేకతను ప్రతిబింబించేలా ఈ పేరును నిర్ణయించారు. సుగంధ పరిమళాలను వెదజల్లే ఆకులు ఈ మొక్క ప్రత్యేకతల్లో ఒకటని అధికారులు తెలిపారు.

ప్రధాన అటవీ సంరక్షణాధికారి (PCCF) పి.వి. చలపతిరావు తన పరిశోధనా సహచరులతో కలిసి తూర్పు కనుమల్లో నిర్వహించిన వృక్షశాస్త్ర పరిశోధనల సందర్భంగా ఈ కొత్త జాతిని గుర్తించారు.

శాస్త్రీయ పరిశీలనల్లో, ఈ మొక్క సమీప సంబంధిత జాతి అయిన క్రోటన్ అరోమాటికస్ (Croton aromaticus)తో పోలిస్తే భిన్నమైన నిర్మాణ లక్షణాలు, పునరుత్పత్తి లక్షణాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు.

ఈ ఆవిష్కరణ తూర్పు కనుమలలో ఉన్న అపార జీవ వైవిధ్య సంపదకు మరో ఉదాహరణగా నిలుస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. పరిమిత భౌగోళిక ప్రాంతంలో మాత్రమే ఈ మొక్క కనిపించడం, సహజ ఆవాసాలపై ఉన్న ముప్పుల కారణంగా దీనిని అంతరించిపోయే ప్రమాదం ఉన్న జాతిగా గుర్తించినట్లు తెలిపారు.

జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, రాష్ట్ర సహజ వారసత్వ సంపదను కాపాడే దిశగా ఈ తరహా శాస్త్రీయ పరిశోధనలు కీలకమని అధికారులు పేర్కొన్నారు.