
తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో కొత్తగా గుర్తించిన అరుదైన వృక్ష జాతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నామకరణం చేశారు. యూఫోర్బియేసీ (Euphorbiaceae) కుటుంబానికి చెందిన ఈ కొత్త జాతికి ‘క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్’ (Croton Ubbalamadugensis) అని పేరు పెట్టారు.
ఉబ్బలమడుగు జలపాతానికి సమీపంలోని కంబకం కొండల ప్రాంతం ఈ మొక్కకు సహజ ఆవాసంగా ఉండటంతో, ఆ ప్రాంత ప్రత్యేకతను ప్రతిబింబించేలా ఈ పేరును నిర్ణయించారు. సుగంధ పరిమళాలను వెదజల్లే ఆకులు ఈ మొక్క ప్రత్యేకతల్లో ఒకటని అధికారులు తెలిపారు.
ప్రధాన అటవీ సంరక్షణాధికారి (PCCF) పి.వి. చలపతిరావు తన పరిశోధనా సహచరులతో కలిసి తూర్పు కనుమల్లో నిర్వహించిన వృక్షశాస్త్ర పరిశోధనల సందర్భంగా ఈ కొత్త జాతిని గుర్తించారు.
శాస్త్రీయ పరిశీలనల్లో, ఈ మొక్క సమీప సంబంధిత జాతి అయిన క్రోటన్ అరోమాటికస్ (Croton aromaticus)తో పోలిస్తే భిన్నమైన నిర్మాణ లక్షణాలు, పునరుత్పత్తి లక్షణాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు.
ఈ ఆవిష్కరణ తూర్పు కనుమలలో ఉన్న అపార జీవ వైవిధ్య సంపదకు మరో ఉదాహరణగా నిలుస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. పరిమిత భౌగోళిక ప్రాంతంలో మాత్రమే ఈ మొక్క కనిపించడం, సహజ ఆవాసాలపై ఉన్న ముప్పుల కారణంగా దీనిని అంతరించిపోయే ప్రమాదం ఉన్న జాతిగా గుర్తించినట్లు తెలిపారు.
జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, రాష్ట్ర సహజ వారసత్వ సంపదను కాపాడే దిశగా ఈ తరహా శాస్త్రీయ పరిశోధనలు కీలకమని అధికారులు పేర్కొన్నారు.





