News

పాకిస్థాన్, హిందూ మహిళలను ఉంపుడుగత్తెలుగా, పెళ్లి కుమార్తెలుగా చైనాకు అమ్మేస్తోంది : అమెరికా దౌత్యవేత్త

978views

పాకిస్థాన్, హిందూ మరియు క్రైస్తవ మహిళలను “ఉంపుడుగత్తెలు” మరియు “బలవంతపు వధువులు” గా చైనాకు విక్రయిస్తోందని మత స్వేచ్ఛకు సంబంధించిన అమెరికా ఉన్నత దౌత్యవేత్త శామ్యూల్ బ్రౌన్ బ్యాక్ తెలిపారు.

“పాకిస్థాన్ లోని మతపరమైన మైనారిటీలు, క్రిస్టియన్ మరియు హిందూ మహిళలే చైనా పురుషులకు “బలవంతపు వధువులు” గా పనికొచ్చే వనరులలో ఒకరు. వారు చైనాకి ఉంపుడుగత్తెలుగా విక్రయించబడ్డారు. చైనాలోకి వధువుల వలే బలవంతంగా పంపబడ్డారు” అని బ్రౌన్ బ్యాక్ మంగళవారం విలేఖరులతో అన్నారు.

“వారికి తగినంత మద్దతు లేదు. పాకిస్థాన్ లో మతపరమైన మైనారిటీలపై వివక్ష ఉంది. అది వారికి మరింత హానికరంగా మారింది. అందుకే అక్కడ ఇలా జరుగుతోంది.” అని ఆయన అన్నారు.

అంతర్జాతీయ మత స్వేచ్ఛా చట్టం ప్రకారం పాకిస్థాన్ ను ప్రత్యేక ఆందోళన ఉన్న దేశంగా (సిపిసి) గుర్తించడానికి ఇది ఒక కారణమని ఆయన పేర్కొన్నారు.

దశాబ్దాలుగా చైనా విధించిన వన్-చైల్డ్ విధానం కారణంగా, అబ్బాయిలకు సాంస్కృతిక ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా మహిళల కొరత ఉంది. ఇది చైనా పురుషులు ఇతర దేశాల నుండి మహిళలను వధువు, ఉంపుడుగత్తెలు మరియు కార్మికులుగా దిగుమతి చేసుకోవటానికి కారణమవుతోంది.

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ను ఇతర అంశాలతో ఉటంకిస్తూ, భారతదేశాన్ని కూడా సిపిసిలో ఉంచాలని యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (USCIRF) సిఫారసు చేసింది. కానీ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో సోమవారం ఈ సూచనను తిరస్కరించారు.

అయితే, వాషింగ్టన్ భారత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నదని “ఈ విషయాలు ప్రభుత్వ, ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలతో జరిగే ప్రైవేట్ చర్చలలో అనేక సార్లు లేవనెత్తాం, లేవనెత్తుతూనే ఉంటాం” అని బ్రౌన్ బ్యాక్ అన్నారు.

పొరుగున ఉన్న ఇస్లామిక్ లేదా ముస్లిం మెజారిటీ దేశాలలో జరిగే మతపరమైన హింస కారణంగా అక్కడి నుండి పారిపోయి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు మరియు సిక్కులకు పౌరసత్వాన్ని CAA వేగవంతం చేస్తుంది. కానీ సాధారణ ప్రక్రియలు పూర్తయిన తరువాత ముస్లింలకు పౌరసత్వం రాకుండా నిరోధించలేదు.

యుఎస్ఎ లో కూడా సిఎఎ మాదిరిగానే చట్టపరమైన నిబంధన ఒకటి ఉంది. దీనిని ‘స్పెక్టర్ సవరణ’ అని పిలుస్తారు. ఇరాన్ నుండి కొంతమంది ముస్లిమేతర మైనారిటీలకు ఆశ్రయం ఇచ్చే నిబంధన బడ్జెట్ బిల్లులో చొప్పించబడింది. ఇందులో ముస్లింలను మినహాయించడం గమనార్హం.

“పాకిస్థాన్ కు మాత్రం సిపిసి హోదాను ఇచ్చి, భారత్ కు ఇవ్వకపోవడం వెనుక మైక్ పాంపియో ద్వంద్వ వైఖరేమన్నా దాగుందా?” అని ఓ పాకిస్థాన్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు, బ్రౌన్ బ్యాక్ మాట్లాడుతూ, పాకిస్థాన్ లో, మైనారిటీలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు చాలా చర్యలు తీసుకుంటున్నాయని, కానీ భారత్లో అలా జరగలేదని బ్రౌన్ బ్యాక్ బదులిచ్చారు.

“ప్రపంచంలో మతభ్రష్టులు లేదా దైవదూషణ చేసినవారి పేరుతో బంధింపబడిన వారిలో సగం మంది పాకిస్థాన్ జైళ్లలోనే ఉన్నారు. ” అని ఆయన అన్నారు.

“భారతదేశంలో, CAA వంటి కొన్ని చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. కాని మత హింస సంఘటనలు కూడా ఉన్నాయి.అలాంటివి జరిగినప్పుడు, “ప్రభుత్వం సమర్థవంతంగా కట్టడి చేయగలుగుతోందా? లేదా? సరైన విధంగా పోలీసు, చట్టబద్దమైన చర్యలు తీసుకోబడుతున్నాయా? అనే విషయాలను మేము పరిశీలిస్తూనే ఉంటాము.” అని బ్రౌన్ బ్యాక్ అన్నారు.

“అంటే CAA తో సమస్యలు లేవని మేం భావిస్తున్నట్టు కాదు” అని ఆయన అన్నారు. “హింస ఒక సమస్య. మేము ఆ సమస్యలను లేవనెత్తుతూనే ఉంటాము.”

“పాకిస్తాన్ సిపిసి జాబితాలో ఎందుకు కొనసాగుతోంది? భారతదేశం ఎందుకు లేదు? అనేదానికి ఇవే కొన్ని ఆధారాలు” అని ఆయన అన్నారు.

“ఇవి ప్రజలు ఎక్కువగా చర్చించుకునే సమస్యలు. మేము రెండు దేశాలలోనూ పాకిస్థాన్ పరిస్థితినే విస్తృతంగా సమీక్షిస్తాము” అని బ్రౌన్ బ్యాక్ అన్నారు.

పాకిస్థాన్ ‌తోపాటు చైనా, మయన్మార్, ఎరిట్రియా, ఇరాన్, నైజీరియా, ఉత్తర కొరియా, సౌదీ అరేబియా, తజికిస్తాన్, తుర్క్ మెనిస్థాన్ ను కూడా మైక్ పాంపియో సిపిసి జాబితాలో పాంపీ ఉంచారు.

Source : Swarajyamag

https://swarajyamag.com/insta/pakistan-marketing-hindu-women-as-concubines-and-forced-brides-to-china-top-us-diplomat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.