
-
పీఎఫ్ఐ ఆఫీసులపై ఎన్ఐఏ దాడులకు ప్రతీకారం…
-
24 గంటల్లో కనీసం 10 దాడులు
చెన్నై: తమిళనాడులో ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు, కార్యకర్తలపై పెట్రోల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. చెన్నైలోని తాంబరంలో ఉంటున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ నివాసంపై శనివారం తెల్లవారుజామున ఒక అగంతకుడు పెట్రోల్ బాంబ్ విసిరాడు. నిందితుని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
గత 24 గంటల్లో ఈ తరహా దాడులు కనీసం పది వరకు జరిగిన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఉగ్రవాద సంబంధాలపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా కీలక దాడులు జరుపుతున్న నేపథ్యంలో తమిళనాడులో పెట్రోల్ బాంబులు రువ్విన ఘటనలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా కోయంబత్తూర్, పరిసర జిల్లాలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యాలయాలపై, నాయకుల ఇండ్లపై, వారి వాహనాలపై దాడులు జరుగుతున్నాయి.
కాగా, తన ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన ఘటనపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ మాట్లాడుతూ, తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో తన నివాసం వెలుపల పెద్ద శబ్దం రావడం, మంటలు చెలరేగడం కనిపించిందని అన్నారు.
కోయంబత్తూరులోని కోవైపుదూర్లో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త నివాసంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
ఒప్పనకర వీధిలోని ఓ వస్త్రాల షాప్పై, ఈరోడ్ లో ఓ ఫర్నిచర్ షాప్పై, కోయింబత్తుర్లో ఓ హిందూ మున్నని నాయకుడి కారుపై బాంబులు వేసిన సంఘటనలు జరిగాయి. తిరుపూర్లో ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కారుపై రాళ్ళు రువ్వారు. మెట్టుపాళ్యంలో ఓ హిందూమున్నని నాయకుడి షాప్ పై నాలుగు పెట్రో బాంబులు విసిరారు. పలువురు కార్యకర్తల వాహనాలపై కూడా దాడులు జరిగాయి.
Source: Nijamtoday





