సేవా భావంలో ‘నేను చేశాను’ అనేది ఉండకూడదు.. ‘దేశం కోసం చేశాను’ అనే భావం ఉండాలి – డాక్టర్ మోహన్ భాగవత్

న్యూఢిల్లీ: మనసులో మనస్ఫూర్తిగా ఇతరులకు సేవ చేయాలన్న తపన, దృఢ సంకల్పం లేకుంటే సేవ చేయలేమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్.ఎస్.ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. సామాజిక సేవా స్పూర్తితో మానవాళి వైభవం పెరుగుతుంది, ఈ సేవాభావం మొత్తం సమాజాన్ని మేల్కొపుతుందన్నారు.
ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఓ కార్యక్రమానికి సర్సంఘచాలక్ జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, మీరు చేస్తున్న సామాజిక సేవాకార్యక్రమాలు మానవాళి సంక్షేమానికి దోహదపడడమే కాకుండా దేశానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.

సేవా భావంలో ‘నేను చేశాను’ అనే భావం ఉండకూడదని, ‘నేను సమాజం కోసం చేశాను, నా ఆత్మీయుల కోసం చేశాను, దేశం కోసం చేశాను’ అనే భావం ఉండాలని మోహన్ జీ అన్నారు. ఇలాంటి సేవ సమాజంలో స్ఫూర్తిని పెంపొందిస్తుంది…సమాజాని ఒక తాటిపై నిలుపుతుందన్నారు. బలమైన దేశానికి సమాజం, నైతికత చాలా ముఖ్యం… సేవ అనేది భగవంతుని పని, మనం ఆ సేవ చేసేందుకు పూనుకున్నప్పుడు ఆ పని విజయవంతం అయ్యేలా ఆ దేవుడు సహకరిస్తాడు. సేవకులకు దేవుడే బలాన్ని ఇస్తాడు. నిజానికి మానవులకు చేసే సేవ భగవంతుని సేవ. సంత్ తుకారాం సందేశాలను ఉదాహరణగా చూపుతూ, నిరుపేదలకు, పేదలకు సేవ చేసే వారే సాధువు అని అన్నారు.
మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీ సేవాభావం సమాజంలో వెలుగులు నింపుతోందని అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ మీ పనిని జాతీయ వేదికపైకి తీసుకువెళుతుంది… మీ అన్ని కార్యకలాపాలకు సహకరిస్తుంది. కాగా, ఈ కార్యక్రమంలో ఢిల్లీకి చెందిన దాదాపు 30 స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తమ అనుభవాలను అందించారు.
Source: VSKBharat





