
లక్నో: ఉత్తర్ప్రదేశ్కు చెందిన ముస్లిం విద్యార్థిని గజాలా ఎంఏ సంస్కృతం విభాగంలో విశ్వవిద్యాలయంలోనే ఉత్తమ విద్యార్థినిగా నిలిచింది. సంస్కృతంలో ఏకంగా అయిదు పతకాలు సాధించింది. లఖ్నవూ యూనివర్సిటీ(ఎల్యూ) డీన్ ప్రొఫెసర్ శశి శుక్లా.. గజాలాకు మెడల్స్ అందజేశారు. గజాలాకు కేవలం సంస్కృతంలోనే కాదు.. ఆంగ్లం, హిందీ, ఉర్దూ, అరబిక్ భాషల్లోనూ మంచి పట్టుంది.
గజాలా తన కుటుంబంతో కలిసి లఖ్నవూలో ఉంటోంది. రోజుకు ఏడు గంటలపాటు సంస్కృతం పఠిస్తోంది. సంస్కృతంలో ప్రొఫెసర్ కావాలన్నదే తన కల అంటోంది గజాలా. క్యాంపస్లో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినా గజాలా పాల్గొంటుంది. సంస్కృతంలో శ్లోకాలు, గాయత్రి మంత్రం, సరస్వతి వందనం లాంటి భక్తి శ్లోకాలు స్టేజీపై పఠిస్తుంది.
అన్ని భాషలకు అమ్మ సంస్కృతం..
“దేవుడి సొంత భాష సంస్కృతం. ఇది అన్ని భాషలకు అమ్మ వంటిది. సంస్కృతంలో పద్యాలు, కవిత్వం వినసొంపుగా ఉంటాయి. 5వ తరగతిలోనే పాఠశాలలో సంస్కృతం నేర్చుకున్నా. ముస్లిం అయి ఉండి సంస్కృతంలో పట్టుసాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. ” అని గజాలా తెలిపింది. ప్రస్తుతం తనకు వైదిక సాహిత్యంలో పీహెచ్డీ చేయాలని ఉందని వెల్లడించింది గజాలా.
Source: ETvBharat





