
: జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (NCERT) విడుదల చేసిన ‘ఎక్స్ప్లోరింగ్ సొసైటీ? ఇండియా అండ్ బియాండ్’ సవరించిన పాఠ్యపుస్తకంలో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన పలు ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన అధ్యాయంలో హిట్లర్, నాజీ భావజాలంపై ఉన్న ప్రస్తావనలను తొలగించగా, స్వతంత్రవీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ స్వరాజ్య డిమాండ్కు కొత్తగా స్థానం కల్పించారు. అలాగే, భారత విభజనకు సంబంధించిన వివరణలో కూడా మార్పులు చేశారు.
‘ఇండియాస్ లాంగ్ రోడ్ టు ఇండిపెండెన్స్’ అధ్యాయంలో, భారత విభజనను భారత జాతీయ కాంగ్రెస్ కూడా తీవ్రంగా వ్యతిరేకించిందని పేర్కొన్నారు. “విభజనను అంగీకరించడమే ఏకైక మార్గమా అన్నది ఇప్పటికీ చర్చనీయాంశమే” అని కొత్త పాఠ్యపుస్తకంలో పేర్కొన్నారు.
మునుపటి సంచికలో ఉన్న “ఆ కాలంలోని పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ నాయకులు నిస్సహాయులుగా విభజనను అంగీకరించారు” అనే వాక్యాన్ని తొలగించారు. అలాగే, బ్రిటిష్ పాలకులు హిందూ–ముస్లిం నాయకుల మధ్య విభేదాలను ఉపయోగించుకుని దేశ విభజనకు దారితీశారని, మహాత్మా గాంధీతో పాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు విభజనను వ్యతిరేకించినప్పటికీ చివరికి పరిస్థితుల దృష్ట్యా అంగీకరించారని గత సంచికలో ఉన్న వివరణలో కూడా మార్పులు చేశారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్కు సంబంధించిన విభాగంలో కూడా మార్పులు చేశారు. సవరించిన పాఠ్యపుస్తకంలో, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు నేతాజీ విదేశీ శక్తుల మద్దతు కోరారని మాత్రమే పేర్కొన్నారు.
మునుపటి సంచికలో నేతాజీ హిట్లర్ సహాయం కోరిన విషయంతో పాటు, హిట్లర్ను నియంతగా, నాజీ భావజాలాన్ని జాత్యహంకార సిద్ధాంతంగా, రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన విస్తరణవాద విధానంగా వివరించిన అంశాలు ఉండేవి. సవరించిన సంచికలో ఆ ప్రస్తావనలన్నింటినీ తొలగించారు.
సవరించిన సిలబస్లో స్వతంత్రవీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ చేసిన కృషిని కూడా చేర్చారు. 1925లోనే సావర్కర్ స్వరాజ్య డిమాండ్ను బలంగా వినిపించారని పాఠ్యపుస్తకంలో పేర్కొన్నారు. దీంతో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన వివరణలో ఆయన పాత్రకు కూడా ప్రాధాన్యం కల్పించారు.
ఈ ఏడాది ప్రారంభంలో 8వ తరగతి NCERT పాఠ్యపుస్తకంలోని న్యాయవ్యవస్థ, అవినీతి, కోర్టు కేసుల పెండింగ్కు సంబంధించిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. అదే సమయంలో నేతాజీ అధ్యాయంలో హిట్లర్ ప్రస్తావనపై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ అంశం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లిన అనంతరం, సంబంధిత పాఠ్యపుస్తకం ముద్రణ, డిజిటల్ పంపిణీపై కోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. అనంతరం NCERT క్షమాపణలు తెలుపుతూ, సంబంధిత సంచికను మార్కెట్తో పాటు డిజిటల్ వేదికల నుంచి ఉపసంహరించుకుని సవరించిన పాఠ్యపుస్తకాన్ని విడుదల చేసింది.





