
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల రాకపోకలకు భారత్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. కరోనా కారణంగా గతేడాది మార్చి నుండి భారత్పై అంతర్జాతీయ విమానాల రాకపోకలకు బ్రేక్ పడింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న సమయంలో భారత్ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించినప్పటికీ, కొన్ని దేశాలతో మాత్రం ‘ఎయిర్ బబుల్’ ఒప్పందం కుదుర్చుకొని పరిమిత ఆంక్షలతో ప్రత్యేక విమానాలను నడిపింది.
అధికారులిచ్చిన తాజా ప్రకటనతో… ఇకపై భారత్ నుంచి, బయటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. కాగా, విదేశీ ప్రయాణికులపై కరోనా ఆంక్షలను త్వరలోనే తొలగించనున్నట్టు సౌదీ అరేబియా తెలిపింది. ఈ జాబితాలో భారత్ సహా మరో ఐదు దేశాలు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం సౌదీ వెళ్ళే విదేశీయులు మరో దేశంలో కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందే. అప్పుడే సౌదీలోకి వారిని అనుమతిస్తున్నారు.
వచ్చే నెల ఒకటోతేదీ నుంచి భారత్, పాకిస్తాన్ తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను నేరుగా తమ దేశంలోకి అనుమతిస్తామని సౌదీ వెల్లడించింది. అయితే ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులంతా కూడా ఐదు రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుందని తెలిపింది.
Source: Nijamtoday





