News

ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల హత్యకు పీఎఫ్ఐ కుట్ర!

1.6kviews

న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రదాడులకు సంబంధించి పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) పన్నిన పన్నాగాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ), ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడాలని పీఎఫ్‌ఐ చూసినట్టు తాజాగా వెల్లడైంది. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం వర్గాలు చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు బయటకొచ్చాయి. నాగ్‌పుర్‌లోని ఆర్​ఎస్​ఎస్ ప్రధాన కార్యాలయం కూడా పీఎఫ్‌ఐ టార్గెట్‌ లిస్ట్‌లో ఉందని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి.

దసరా వేళ మహారాష్ట్రలో ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సభ్యుల కదలికలపై నిఘా పెట్టాలని పీఎఫ్ఐ ప్రణాళికలు చేసినట్టు సమాచారం. వీరిని టార్గెట్‌ చేసుకుని దేశంలో.. మత విద్వేషాలను రెచ్చగొట్టాలని కుట్రలు పన్నుతున్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ, సంఘ్‌ నేతలతో పాటు పలు ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారులు కూడా వీరి హిట్‌ లిస్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని ఆర్​ఎస్​ఎస్​ కార్యాలయాలపై ఈ సంస్థ సభ్యులు రెక్కీలు కూడా నిర్వహించినట్టు, ఇదే విషయాన్ని నిఘా వర్గాలు కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా నేతలు, సంస్థలకు భద్రతను కట్టుదిట్టం చేసినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

2047 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఎజెండాతో పనిచేస్తున్న ఆరుగురు వ్యక్తులను యూపీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ శనివారం అరెస్టు చేసింది. వారి నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్టు సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి