
* హిందువుల పండుగలపై ప్రభుత్వ తీరుపై సోము వీర్రాజు ఫైర్
వినాయక చవితి వేడుకలకు నిబంధనలు పెట్టడమేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
గణేశ్ ఉత్సవాలు ఎలా నిర్వహించాలో హైదరాబాద్ ఉత్సవాలు చూసి ముఖ్యమంత్రి జగన్ నేర్చుకోవాలని హితవు పలికారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాజమహేంద్రవరంలో నిర్వహించే వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటానని.. దమ్ముంటే తనను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. గణేశ్ ఉత్సవ కమిటీలను ప్రభుత్వం అడ్డుకుంటే భాజపాకు సమాచారం ఇవ్వాలన్న వీర్రాజు..
వారికి భాజపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గణేశ్ నవరాత్రులు దగ్గర పడేంతవరకు కాలయాపన చేసి ఫైర్, విద్యుత్, పోలీసు పర్మిషన్ల పేరుతో ప్రభుత్వం ఉత్సవాలను పరోక్షంగా నిరోధించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువుల పండుగల పట్ల కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. నిబంధనల పేరుతో పండుగను అడ్డుకోవాలనుకుంటే భాజపా చూస్తూ ఊరుకోదన్నారు.





