
* విభజన అల్లర్లలో మృతి చెందిన వారికి నివాళి అర్పించిన మోడీ
దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోడీ, భాజపా సీనియర్ నేతలు నివాళులు అర్పించారు. నిన్న (14/8/2022) ‘విభజన విషాద స్మృతి దినం’ సందర్భంగా ప్రధాని ట్వీట్ చేశారు. నాటి విషాదకర సమయంలో బాధలకోర్చి నిలబడిన వారి మొక్కవోని ధైర్యం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆగస్టు 14వ తేదీని ‘విభజన విషాద స్మృతి దినం’గా పాటించనున్నట్లు గత ఏడాది ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. విభజన.. దేశ చరిత్రలోనే అమానవీయ అధ్యాయమని, స్వార్థ రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాలు నాటి బాధాకర అంశాలకు ఎలా దారితీశాయన్నది ఎన్నటికీ మరిచిపోలేమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

1947లో దేశ విభజనకు దారితీసిన ఘటనలను విశ్లేషిస్తూ భాజపా ఓ వీడియోను ట్విటర్లో ఉంచింది. ఆ వీడియోను బట్టి నాడు పాకిస్థాన్ ఏర్పాటుకు జిన్నా నేతృత్వంలోని ముస్లింలీగ్ డిమాండ్లకు నెహ్రూ తలొగ్గినట్లు అర్థమవుతోంది. ‘‘భారత సాంస్కృతిక వారసత్వం, నాగరికత, విలువలు వంటి వాటి పట్ల అవగాహన లేనివారు కేవలం 3 వారాల్లో శతాబ్దాల తరబడి కలిసి ఉంటున్న ప్రజల మధ్య సరిహద్దును గీశారు’’ అని భాజపా ట్వీట్ చేసింది.





