
కశ్మీర్: పవర్ కట్లు, సర్చార్జీలపై నిరసన వ్యక్తంచేస్తూ ధర్నా చేపడదామని కశ్మీరీ జాతీయవాద పార్టీలు జులై 25న పిలుపునిచ్చాయి. అప్పటి నుంచి హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
విద్యుత్ బిల్లులలో కొన్ని పన్నులను అదనంగా కలిపి తమ దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారని, విద్యుత్ కోతలు కూడా పెరిగాయని నిరసనకారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో భారీగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, ఇక్కడి వారికి ఎలాంటి ప్రయోజనాలూ దక్కడం లేదని నిరసనకారులు అంటున్నారు.
ఈ నిరసనలను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో.. హింసాత్మక పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఆ తర్వాత 20 మందిని అరెస్టు చేశారు.
ఆందోళనకారులను అరెస్టు చేయడంతో నిరసనలు మరింత హింసాత్మకంగా మారాయి. లాయర్లు, వ్యాపారులు, రవాణా సంఘాలు, ప్రధాన రాజకీయ పార్టీలు కూడా నిరసనకారులకు మద్దతు ప్రకటించాయి.
పాకిస్తాన్ పాలిత కశ్మీర్లోని ప్రజల భవిష్యత్పై ఆందోళనే ఈ నిరసనలకు మూలమనే విశ్లేషణలు వస్తున్నాయి.
పాకిస్తాన్ పాలిత కశ్మీర్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు రాజ్యాంగానికి సవరణ చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే వార్తలు కూడా వస్తున్నాయి.
2018లో ఆర్థిక, పరిపాలన అంశాల్లో ముజఫరాబాద్కు పాకిస్తాన్ స్వయంప్రతిపత్తి ఇచ్చింది. అంతకుమందు ‘‘ఆజాద్ జమ్మూకశ్మీర్ కౌన్సిల్’’ నియంత్రణలో ఈ ప్రాంతం ఉండేది. ఈ కౌన్సిల్కు పాకిస్తాన్ ప్రధాన మంత్రే అధిపతి. పన్నుల సేకరణ, పర్యటకం, సహజ వనరులు తరదితర విభాగాలపై పరిపాలనా ఆధిపత్యం ఈ కౌన్సిల్కు ఉండేది.
అయితే, 2018లో తీసుకొచ్చిన మార్పులను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఇక్కడి కశ్మీరీలు భావిస్తున్నారు.





