News

కర్ణాటకలో ముస్లిం విద్యాసంస్థల కుయుక్తులు…. హిజాబ్ ధరించే కళాశాల ఏర్పాటుకు యత్నం!

368views

బెంగ‌ళూరు: ముస్లిం విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతి ఇచ్చే కళాశాలలను ఏర్పాటు చేయాలని కర్ణాటకలోని ముస్లిం విద్యా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దక్షిణ కన్నడలో ప్రీ-యూనివర్సిటీ కళాశాలల ఏర్పాటుకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని 13 ముస్లిం విద్యా సంస్థలు కోరాయి. హిజాబ్ వివాదం ఇటీవల ఇక్కడి నుంచే ప్రారంభమైన సంగతి తెలిసిందే.

తరగతి గదుల్లోకి ఎటువంటి మతపరమైన వస్త్రాలను అనుమతించరాదని హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యధిక ముస్లిం విద్యార్థినులు పాటిస్తున్నారు. కానీ, కొందరు మాత్రం హిజాబ్ ధారణపై పట్టుబడుతున్నారు. తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతి లేకపోవడంతో ఇటువంటివారు చదువు మానేశారు. నిబంధనలను రూపొందించుకునే అధికారం కళాశాల అభివృద్ధి కమిటీలకు ఉందని ప్రభుత్వ ఆదేశాలు పేర్కొంటున్నాయి. అందువల్ల 13 ముస్లిం విద్యా సంస్థలు దక్షిణ కన్నడ జిల్లాలో ప్రీ-యూనివర్సిటీ కాలేజీల ఏర్పాటుకు అనుమతులను కోరుతున్నాయి.

అయితే ఇప్పటి వరకు ఒక ముస్లిం విద్యా సంస్థకు మాత్రమే పీయూ కాలేజీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. హిజాబ్ ధరించడానికి అనుమతిస్తూ ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. గత వారం మంగళూరులో వందలాది మంది ముస్లిం బాలికలు ప్రదర్శన నిర్వహించారు. హిజాబ్ ధరించడం తమ హక్కు అని, తమకు అనుమతి ఇవ్వాలని కోరారు. వీరంతా క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి