News

మోదీని చూసి దగ్గరకొచ్చి భుజం తట్టిన బైడెన్!

385views

మ్యునిచ్‌: జర్మనీలోని మ్యునిచ్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో అక్కడికి హాజరైన దేశాధినేతలతో మోదీ వరుసగా సమావేశమయ్యారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీతోపాటు పలు దేశాధినేతలు సదస్సుకు హాజరుకాగా, వారితో మోదీ పలు అంశాలపై చ‌ర్చ‌లు జరిపారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది.

సదస్సులో మోదీ దగ్గరకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధానిని ఆత్మీయంగా పలకరించారు. సదస్సు ప్రారంభానికి కొద్దిసేపటి ముందు మోదీని, బైడెన్ కలిసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో దేశాధినేతలంతా పలకరించుకుంటూ ఫొటోలు దిగుతున్నారు. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోతో మోదీ మాట్లాడుతూ, చేయి పట్టుకుని మెట్ల మీది నుంచి దిగుతున్నారు. అప్పుడే వెనుక నుంచి వచ్చిన బైడెన్, మోదీ దగ్గరకు చేరుకుని, ఆయన భుజం తట్టి మరీ పలకరించారు. వెంటనే వెనక్కు తిరిగిన మోదీ, బైడెన్ చూసి కరచాలనం చేసి, నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్థికంగా ఉన్నత దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ దేశాలు కలిసి జీ-7 కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు జర్మనీలో జరుగుతోంది జీ-7 సదస్సు. ఇందులో ఇండియాకు సభ్యత్వం లేదు. అయినప్పటికీ అతిథి దేశంగా ఇండియాకు ఆహ్వానం లభించింది. అందుకే మోదీ సదస్సుకు హాజరయ్యారు. ఇండియాతోపాటు ఇండోనేషియా, సెనెగల్, దక్షిణాఫ్రికా, అర్జెంటీనాలకు కూడా ఈ సదస్సుకు ఆహ్వానం అందింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి