News

కావాలనే ప్రధాని మోదీ ఫోటో తొల‌గించారా?

606views

చెన్నై: పౌరసరఫరాల కార్యాలయం నుంచి ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను తొలగించిన వేప్పత్తూరు టౌన్‌ పంచాయతీ చైర్మన్‌ అంజమ్మల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరువిడైమరుత్తూరు పోలీసులకు తమిళనాడు రాష్ట్రం కుంభకోణం మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

పట్టణ పంచాయతీకి చెందిన బీజేపీ కౌన్సిలర్ ఎస్. చంద్రశేఖరన్ ఈ నెల ఆరోతేదీన‌ ప్రధానమంత్రి ఫోటోను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లతకు అందజేశారు. కౌన్సిలర్ ఆ ఫోటోను పౌరసరఫరాల కార్యాలయంలో ఉంచాలని కార్యనిర్వాహక అధికారిని కోరారు. ఇటీవల వేప్పత్తూరు పట్టణ పంచాయతీ చైర్మన్‌గా ఎన్నికైన అంజమ్మల్‌ తన భర్త మథియాళగన్‌తో కలిసి ఏప్రిల్‌ 12న ఆ ఫొటోను తీసివేసి మళ్ళీ ఎగ్జిక్యూటివ్‌ అధికారికి అందజేశారు.

2021 సంవత్సరం ప్రారంభంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని కోరుతూ తమిళనాడులోని కడలూరుకు చెందిన భారతీయ జనతా పార్టీ సభ్యుడు ఆర్.జయకుమార్ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులు తదితరుల చిత్రపటాలు మాత్రమే ఉన్నాయని, రాష్ట్రపతి, ప్రధానమంత్రి చిత్రపటాలు విస్మరించారని మండిపడ్డారు. 1978లో జారీ చేయబడిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలలో ప్రదర్శించబడే చిత్రాల జాబితాలలో మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇతర రాష్ట్ర నాయకుల చిత్రాలే కాకుండా రాష్ట్రపతి, ప్రధానమంత్రి చిత్రాలు కూడా ఉండాలి. అందుకు వ్యతిరేకంగా తమిళనాడులో నడుచుకుంటూ ఉన్నారనే విమర్శలు వెంటాడాయి.

ప్రధాని ఫోటోను తొలగించడానికి గల కారణాలను కూడా కార్మికులు అడుగుతున్నారు. రాజ్‌భవన్‌, సీఎం కార్యాలయం, క్యాబినెట్‌ సభ్యుల క్యాబిన్‌లు, డిపార్ట్‌మెంట్‌లోని అన్ని ప్రధాన కార్యాలయాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఫొటోలను ప్రదర్శించాలని కోరుతున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి