
పూణే: ఆర్ఎస్ఎస్ హాస్పిటల్ ఒక్క హిందువులకేనా? అని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. అయితే, మతం ఆధారంగా ఆర్ఎస్ఎస్ వివక్ష చూపదని తాను చెప్పినట్టు గడ్కరీ వెల్లడించారు. మహారాష్ట్ర పూణేలోని సింహగడ్ ప్రాంతంలో ఛారిటబుల్ ఆసుపత్రిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తూ గతంలో రతన్ టాటా, ఆయనకు మధ్య జరిగిన ఒక సంభాషణను గుర్తు చేశారు.
శివసేన-బీజేపీ ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఔరంగాబాద్లో దివంగత ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేబీ హెడ్గేవార్ పేరిట ఆస్పత్రిని ఏర్పాటు చేసిన్నట్టు చెప్పారు. దాని ప్రారంభోత్సవానికి రతన్ టాటాను ఆహ్వానించడం కోసం ఓ సీనియర్ ఆర్ఎస్ఎస్ నేత తన సహాయం కోరారని తెలిపారు.
తాను రతన్ టాటాను సంప్రదించి, హాస్పిటల్ ప్రారంభానికి ఒప్పించాను అని పేరొంటూ.. అయితే రతన్ టాటా హాస్పిటల్కు చేరుకున్నాక ఆర్ఎస్ఎస్కు చెందిన ఈ ఆసుపత్రి ఈ హాస్పిటల్ కేవలం హిందువులకే సేవలు అందిస్తుందా అని అడిగారని గడ్కరీ చెప్పారు.
అయితే, మీరు ఎందుకు అలా అనుకున్నారు? అని తాను అడిగినట్టు గడ్కరీ చెప్పారు. ఆర్ఎస్ఎస్కు చెందినది కావడంతో తనకు ఆ సందేహం కలిగిందని రతన్ టాటా వెంటనే బదులిచ్చారని తెలిపారు. అయితే, ఆర్ఎస్ఎస్ ఆసుపత్రి అన్ని వర్గాల కోసమని, ఆర్ఎస్ఎస్లో ఎలాంటి వివక్షలు ఉండవని తాను చెప్పానని పేర్కొన్నారు. దీని గురించి మరింతగా వివరించడంతో రతన్ టాటా చాలా సంతోషించారని అప్పట్లో జరిగిన సన్నివేశాన్ని నితిన్ గడ్కరీ గుర్తు చేసుకున్నారు.
Source: Nijamtoday




