
425views
-
దర్శనాలు వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచన
తిరుపతి: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమలలో తాజాగా కొండచరియలు విరిగి మూడు చోట్ల రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. రెండో కనుమ దారి లింక్ రోడ్డుకు సమీపంలోని రహదారిపై.. పెద్ద బండరాళ్లు అడ్డంగా పడిపోయాయి. ఘటన సమయంలో వాహన రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రోడ్డుపై అడ్డంగా రాళ్లు పడటం వల్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. అధికారులు రాళ్లను తొలిగిస్తున్నారం. బండరాళ్లు పడటంతో రహదారి ధ్వంసమైంది.
రోడ్డు మరమ్మతులు పూర్తయ్యేవరకు తిరుమల కొండపైకి వెళ్లే రహదారిని పూర్తిగా మూసివేశారు. కొండనుంచి దిగువకు వచ్చే మార్గంలోనే వాహనాలకు అనుమతినిచ్చారు. దిగువ కనుమ దారిలోనే విడతలవారీగా పైకి, కిందకు వాహనాలను పంపిస్తున్నారు. భక్తులు దర్శనాలను వాయిదా వేసుకోవాలని తితిదే ఉన్నతాధికారులు సూచించారు.





