
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో మెగా టెక్స్టైల్ పార్కుల విషయం ముందడుగు వేసింది. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని ఈ ఏడాది ఉత్పాదకత ఆధారిత బోనస్గా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో 11 లక్షల 56 వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం రాత్రి జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. దేశవ్యాప్తంగా 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రాబోయే ఐదేళ్లలో 4 వేల 445 కోట్లతో వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ నిర్ణయంతో 7 లక్షల మందికి ప్రత్యక్షంగాను 14 లక్షల మందికి పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పీపీపీ పద్ధతిలో పీఎం మిత్ర పార్కులను అభివృద్ధి చేయనున్నాయి. ఇప్పటికే 10 రాష్ట్రాలు వీటి ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయని కేంద్రమంత్రి పియూష్ గోయల్ తెలిపారు. కేంద్ర కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్లు మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు తెలిపారు.