
ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్కు విముక్తి లభించింది. ఐదు రోజుల తర్వాత నక్సల్స్ ఆ జవానును విడుదల చేశారు. రాకేశ్వర్ సింగ్ మరి కాసేపట్లో బీజాపూర్ క్యాంపుకు చేరుకోనున్నారు.
బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దులో ఈ నెల 3న జరిగిన ఎన్కౌంటర్లో రాకేశ్వర్ సింగ్ను మావోయిస్టులు అపహరించిన విషయం తెలిసిందే. జవాను తమ వద్ద బందీగా ఉన్నట్లు ఈ నెల 5న లేఖ విడుదల చేసిన నక్సల్స్.. బుధవారం ఆయన ఫొటోను పత్రికలకు పంపించాయి. ఓ పూరి గుడిసెలో జవాను క్షేమంగా ఉన్నట్లు అందులో కన్పించింది. తమ తండ్రిని విడిచిపెట్టాలంటూ జవాను కుమార్తె చేసిన విజ్ఞప్తిని మీడియా ద్వారా స్వీకరించామని మావోయిస్టులు నిన్న ప్రకటించారు. ఈ నెల 3న జరిగిన భీకర ఎన్కౌంటర్లో మావోయిస్టుల చేతిలో 22మంది జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే.

రాకేశ్వర్ సింగ్ స్వస్థలం జమ్మూ. 210వ కోబ్రా దళంలో విధులు నిర్వహిస్తున్నారు. జవానును కిడ్నాప్ చేశారన్న వార్త తెలియగానే ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనకు లోనైంది. తన భర్తను ప్రాణాలతో విడిపించి ఆదుకోవాలని ప్రధానిని, కేంద్ర హోంమంత్రిని జవాను భార్య కోరారు. తండ్రిని విడిచిపెట్టాలంటూ జవాను ఐదేళ్ల కుమార్తె శ్రాగ్వి కన్నీళ్లతో కోరింది. చిన్నారి ఫొటో సోషల్మీడియాలో వైరల్ అయ్యింది. రాకేశ్వర్ సోదరుడు గతంలో మెరుపుదాడి ఘటనలో చనిపోయారు.





