News

మణిపూర్‌లో కాల్పులు.. ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు మృతి

247views

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్‌ జిల్లాలోని నారసేన ప్రాంతంలో భద్రతా బలగాలపై సాయుధ మిలిటెంట్లు దాడులకు తెగపడ్డారు. సీఆర్‌పీఎఫ్‌ 128 బెటాలియన్‌ అవుట్‌పోస్ట్‌ లక్ష్యంగా బాంబులు విసిరారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మిలిటెంట్లు విసిరిన ఒక బాంబు అవుట్‌పోస్ట్‌కు సమీపంలో పేలుడంతో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సైనికులు మృతి చెందారు. మరో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

‘ఎతైన కొండ ప్రాంతాల నుంచి మిలిటెంట్లు సీఆర్‌పీఎఫ్‌ 128 బెటాలియన్‌పై కాల్పులు జరిపారు. సీఆర్‌పీఎఫ్‌ 128 బెటాలియన్‌ లక్ష్యంగా తెల్లవారుజామున 12.30 నుంచి 2.15 వరకు కాల్పులు జరిపారు. కాల్పులతో పాటు మిలిటెంట్లు బాంబులు కూడా విసిరారు. ఒక బాంబు సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌ క్యాంప్‌కు సమీపంలో పేలింది’అని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మృతి చెందినవారు.. సీఆర్‌పీఎఫ్‌ సబ్ ఇన్స్‌పెక్టర్‌ ఎన్‌. శంకర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ అనుప్‌ సైనీగా పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన మిలిటెంట్ల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.