News

క్రైస్తవంలోకి మారాక కూడా ఎస్సీ హోదా చెల్లదు

9views

క్రైస్తవంలోకి మారి, ఆ మతం గురించి బోధిస్తూ, మతాచారాలు పాటించేవారు ఎస్సీల కిందకు రారని మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పిటిషనర్‌ చింతాడ ఆనంద్‌ ఏప్రిల్‌ 21న దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ నెల 15న ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రతులు శనివారం వెలువడ్డాయి. ‘ఎస్సీల కిందకు ఎవరు వస్తారన్నది రాజ్యాంగ (ఎస్సీ) ఉత్తర్వులు-1950లో స్పష్టంగా ఉంది. ఆ ఉత్తర్వుల్లోని క్లాజ్‌-3లో పేర్కొన్న మతాలు మినహా.. మరే మతంలోకి మారినా పుట్టుకతో సంబంధం లేకుండా ఎస్సీ హోదా పోతుంది. అలాంటివారు ఎలాంటి చట్టబద్ధమైన ప్రయోజనాలు, రక్షణలు, రాజ్యాంగం, పార్లమెంటు, శాసనసభలు చేసిన చట్టాల కింద పేర్కొన్న రిజర్వేషన్లు, హక్కులు, ప్రాధాన్యతలను పొందలేరు. రాజ్యాంగ ఉత్తర్వుల్లోని క్లాజ్‌-3 ప్రకారం వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీలుగా పరిగణించడానికి వీల్లేదు’ అని మార్చి 24న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు పునఃసమీక్ష కోసం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. తాము గతంలో ఇచ్చిన తీర్పులో ఎలాంటి పొరపాట్లూ లేనందున దీన్ని డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ‘వాస్తవానికి, ఆఫీస్‌ నివేదిక ప్రకారం రివ్యూ పిటిషన్‌ లోపభూయిష్టంగా ఉంది. అందులోని లోపాలను నోటిఫై చేసినా పిటిషనర్‌ వాటిని సరిదిద్దలేదు. అయినా, న్యాయప్రయోజనాల దృష్ట్యా రిజిస్ట్రీ ప్రస్తావించిన లోపాలను పక్కనపెట్టి రివ్యూ పిటిషన్‌ను పరిశీలించాం. గత తీర్పులో ఎలాంటి లోపాలూ లేనందన డిస్మిస్‌ చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది.