
499views
ముంబై: సెంట్రల్ విస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించినప్పటి నుంచి నాలుగు సింహాల రూపుపై వివాదం కొనసాగుతూనే ఉంది. జాతీయ చిహ్నంలో మార్పులు చేసి, దేశాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. పాత చిహ్నంలో కనిపించే సింహాలు ఎంతో ప్రశాంతంగా ఉండేవని, వాటిని క్రూరంగా చిత్రిస్తూ కొత్త చిహ్నాన్ని తయారు చేశారని మండిపడుతున్నారు.
అయితే, ఈ వివాదంపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. ప్రధానమంత్రి సంగ్రహాలయ్ ట్వీట్ చేసిన వీడియోను పోస్ట్ చేస్తూ…అందులో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “సింహానికి కోరలున్నప్పుడు వాటిని చూపించుకోవటంలో తప్పేముంది. ఈ సింహం స్వేచ్ఛాయుత భారత్కు ప్రతీక. అవసరమైన సమయాల్లో దాడి చేసేందుకూ వెనకాడదు. జైహింద్” అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు.



