
-
నేడు బసవేశ్వరుడి జయంతి
అమరావతి: బసవేశ్వర జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ప్రభుత్వాలు అధికారంగా నిర్వహించనున్నాయి. ఏపీ యువజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక శాఖలతోపాటు అన్ని జిల్లాల్లోను కలెక్టర్లు మంగళవారం బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ సమీర్ శర్మ ఆదేశించారు.
మరోవైపు తెలంగాణలో సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త బసవేశ్వరుడి జయంతిని ప్రభుత్వం అధికారికంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించనుంది. ఈ విషయాన్నీ తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ అధ్యక్షుడు హనుమంత్రావు, ప్రధానకార్యదర్శి మల్కాపురం శివకుమార్ తెలిపారు.
హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో ఒకరు
బసవేశ్వరుడు(1134–1196) హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో ఒకరు. ఆయన సమాజంలో కుల, వర్ణ, లింగ బేధాలు లేవని, అందరం సమానమేనని సుమారు గత ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే చాటి చెప్పారు. అందుకనే బసవేశ్వరుడిని బసవన్న, బసవుడు, విశ్వగురు అని పిలుస్తారు. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది. లింగాయత ధర్మం స్థాపించారు.
కర్ణాటకలోని బాగేవాడి బసవేశ్వరుడి జన్మస్థలం. తండ్రి మాదిరాజు, తల్లి మాదాంబ. చిన్న వయసులోనే శైవ పురాణ గాథలను అభ్యసించాడు. ఉపనయనం చేస్తున్న తల్లిదండ్రులను వదలి కూడలసంగమ అనే పుణ్యక్షేత్రం దగ్గరకు చేరి.. అక్కడ ఉన్న సంగమేశ్వరుణ్ణి నిష్ఠతో ధ్యానించాడు.
12వ శతాబ్దంలో కర్ణాటక దేశాన్ని పాలించిన బిజ్జలుని కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి, అతని భాండాగారానికి ప్రధాన అధికారియై భండారీ బసవడుగ ఖ్యాతినొందారు. బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో “లింగాయత ధర్మం”గా స్థిరపడింది. పాల్కురికి సోమనాథుడు తెలుగులో బసవపురాణం రాశారు. శివుడే సర్వేశ్వరుడు, శివుడిని మించిన వాడులేడన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకున్నారు. అలా లింగాయత మతానికి బీజాలు వేశారు.





