కరోనా నివారణకు.. తిరుమలలో రామాయణ, విషూచికా మంత్ర పారాయణ.. కోట్లాది మంది టీవీల ద్వారా పాల్గొనాలని వినతి

ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం ఉదయం బాలకాండ పారాయణం నిర్వహించారు. బాలకాండలోని ప్రథమ, ద్వితీయ సర్గల్లో ఉన్న మొత్తం 143 శ్లోకాలు వేద పండితుల అఖండ పారాయణంతో సప్తగిరులు మార్మోగాయి. ఇదే విషయంపై ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్యాపకులు ఆచార్య ప్రవా రామక్రిష్ణ సోమయాజులు మాట్లాడుతూ.. మన పూర్వీకులు మనకు అందించిన దివ్య శక్తి మంత్రోచ్ఛరణ అని, దీనితో సమస్త రోగాలను నయం చేయవచ్చని తెలిపారు. ప్రపంచ శాంతి, కరోనా మూడవ వేవ్ చిన్న పిల్లలను ఇబ్బంది పెడుతుందని ప్రభుత్వాలు, వైద్య సంస్థలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పిల్లలు, పెద్దలు అన్ని వర్గలవారు సుఖశాంతులతో ఉండాలని బాలకాండ పారాయణం నిర్వహస్తున్నామని చెప్పారు. బాలకాండ ప్రథమ, ద్వితీయ సర్గల్లోని మొత్తం 143 శ్లోకాలను, విషూచికా మహమ్మరి నివారణ మంత్ర పారాయణం ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారంలో కోట్లాది మంది ప్రజలు ఒకేసారి పారాయణం చేస్తే ఫలితం అనంతంగా ఉంటుందన్నారు. దీనిని పారాయణం చేయడం వలన ఆరోగ్యం, సుఖం, శాంతి, విద్యా, ఐశ్వర్యం సిద్ధిస్తాయని వివరించారు.
అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నారు.





