News

తిరుమలలో దర్శనాలు, గదుల పేరుతో భక్తులను మోసగిస్తున్న వారిపై కఠిన చర్యలు

0views

ఇటీవల కాలంలో తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు, గ‌దులు ఇప్పిస్తామంటూ కొంద‌రు వ్య‌క్తులు సామాజిక మాధ్యమాల్లో భ‌క్తుల‌ను నమ్మబలికి మోస‌గించి డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని టీటీడీ తెలిపింది.

దీనిలో భాగంగా టీటీడీ విజిలెన్స్ వారి సహకారంతో, పోలీసుల స‌మ‌న్వ‌యంతో సోషియ‌ల్ మీడియాలో “శ్రావ‌ణ్ క‌ళ తిరుమ‌ల‌, తిరుప‌తి వెంకటేశ్వ‌ర స్వామి దేవ‌స్థానం” ఐడీతో భ‌క్తుల‌ను మోస‌గిస్తున్న చిత్తూరుజిల్లా పెనుమూరుకు చెందిన కామ‌సాని ప‌వ‌న్ కుమార్ అలియాస్ నాగ‌రాజు, బోడిరెడ్డి చెన్న‌కేశ‌వులు అనే వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు త‌ర‌లించ‌డం జ‌రిగేలా చేయడం జరిగిందని చెప్పింది.

ఇటీవ‌ల సోషియ‌ల్ మీడియాలో భ‌క్తుల‌ను మోస‌గిస్తున్న ఉందంతాల దృష్ట్యా భ‌క్తులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని టీటీడీ విజ్ఞ‌ప్తి చేస్తోంది. టీటీడీ అధికారిక మాధ్యమాల ద్వారానే దర్శనాలు, గదులు బుక్ చేసుకోవాలని భక్తులను కోరింది.

ఎవ‌రైనా తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు, గ‌దులు తీసి ఇస్తామ‌ని చెబితే న‌మ్మ‌కూడ‌ద‌ని భ‌క్తుల‌ను కోర‌డ‌మైన‌ది. అలాంటి వ్య‌క్తుల స‌మాచారం తెలిస్తే టీటీడీ విజిలెన్స్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నెంః9866898630కు ఫిర్యాదు చేయాలని తెలిపింది.