
ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక ‘వాట్సప్’నకు ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ సుమారు రూ.1,950 కోట్ల జరిమానా విధించింది! యూరోపియన్ యూనియన్ డేటా పరిరక్షణ నిబంధనలను ఆ సంస్థ 2018లో ఉల్లంఘించినట్టు నిర్ధరించింది. వినియోగదారుల వ్యక్తిగత వివరాలను ఫేస్బుక్ అనుబంధ సంస్థలతో పంచుకోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. తద్వారా వారి గోప్యతకు భంగం కలిగించిందని తేల్చింది. ఇందుకు పరిహారంగా వాట్సప్నకు 225 మిలియన్ యూరోల జరిమానా విధిస్తూ గురువారం నిర్ణయం వెలువరించింది.
పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పిస్తూ యూరోపియన్ యూనియన్ ‘జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్’ పేరున మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. సామాజిక మాధ్యమాలు వీటిని తప్పకుండా అనుసరించాలని విస్పష్టం చేసింది. అయినా, ఈ నిబంధనలకు వాట్సప్ తూట్లు పొడిచిందని కమిషన్ పేర్కొంది. యూరోపియన్ యూనియన్ నిబంధనలకు అనుగుణంగా డేటా ప్రాసెసింగ్ విధానాలను మార్చుకోవాలని ఆ సంస్థకు మరోసారి సూచించింది. ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ తమకు జరిమానా విధిస్తూ తీసుకున్న నిర్ణయంతో వాట్సప్ విభేదించింది.





