
కరోనా రెండోదశ వ్యాప్తి కారణంగా విధించిన లాక్డౌన్ను పలు రాష్ట్రాలు క్రమంగా సడలిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలకు సందర్శకులు పోటెత్తుతున్నారు. మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు.ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నిబంధనలను అతిక్రమించిన వారిని ఉపేక్షించవద్దని జిల్లా మెజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేసింది. వారాంతాల్లో రద్దీని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలో ముస్సోరి, నైనితాల్ ప్రాంతాల నుంచి దాదాపు 8000 మంది పర్యాటకులను ఉత్తరాఖండ్ పోలీసులు వెనక్కి తిప్పి పంపారు. సరిహద్దు చెక్పోస్టులను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. మూడో ముప్పు పొంచి ఉన్న తరుణంలో పరిమిత సంఖ్యలోనే పర్యాటకులను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.
ఇటీవల ఉత్తరాఖండ్లోని కెంప్టీ జలపాతం వద్ద సందర్శకుల సందడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. కరోనా నిబంధనలను పాటించకుండా జనం గుమిగూడటంపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పర్యాటక ప్రాంతాల్లో కొవిడ్ పరిస్థితులు గతితప్పితే సంబంధిత జిల్లా మెజిస్ట్రేట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ వెళ్లే పర్యాటకులు ఆర్టీపీసీఆర్, ట్రూనాట్, సీబీనాట్, రాపిడ్ యాంటీజెన్ టెస్టు రిపోర్టులో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. 72 గంటల ముందు పరీక్షించిన రిపోర్టులనే పరిగణనలోకి తీసుకుంటారు.





