
కరోనాతో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రధాని మోడీ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట రూ.20లక్షల కోట్లతో భారీ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ప్యాకేజీ వివరాలను ఆర్ధిక మంత్రి ప్రకటించనున్నారు. ఇది మన దేశ జీడీపీలో 10 శాతమని తెలిపారు. ఈరోజు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ మట్లాడుతూ.. ”కరోనాతో నాలుగు నెలలకు పైగా ప్రపంచం పోరాడుతోంది. కరోనాపై విజయం సాధించేందుకు అందరూ కలిసి పోరాడుతున్నారు. ఈ వైరస్ ప్రపంచానికి తీవ్ర నష్టం కలిగించింది. ప్రస్తుతం ప్రపంచం సంక్షోభంలో ఉంది. మరింత సంకల్పంతో పోరాడాల్సిన సమయమిది. ఈ ఆపద మనకో సంకేతం, సందేశం ఇచ్చింది. ఈ ఆపద మనల్ని అవసరం వైపు నడిపించింది” అన్నారు.
”కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ ముందుకు సాగాలి. కరోనాకు ముందు, కరోనా తర్వాత అని విశ్లేసించుకోవాల్సిన అవసరం ఉంది. భారత్లో కూడా అనేకమంది అయినవారిని కోల్పోయారు. ఒకే ఒక్క వైరస్ ప్రపంచాన్ని తలక్రిందులు చేసింది. ప్రపంచం మొత్తం ప్రాణం కోసం యుద్ధం చేస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు.. వినలేదు. మన పోరాట సంకల్పాన్ని మరింత బలపరుచుకోవాలి.
ప్రపంచ వ్యాప్తంగా నేటి పరిస్థితి నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది. ప్రపంచ మానవాళికి ఇదో పెద్ద సవాల్. ఒక చిన్న వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇలాంటి పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదు. కరోనాతో వచ్చిన సవాళ్లను మనం అధిగమించాం. అప్పుడు మన దగ్గర ఒక్క పీపీఈలు, N -95 మాస్క్లు ఉత్పత్తి కాలేదు. కానీ ఇప్పుడు వాటిని లక్షల్లో తయారు చేస్తున్నాం. రోజూ 2లక్షల పీపీఈ కిట్లు, 2లక్షల N – 95మాస్కుల్ని తయారుచేస్తున్నాం. వసుధైక కుటుంబం భావనలో ప్రపంచ దేశాల్ని ఆదుకొనేందుకు భారత్ ముందుంటుంది” అని చెప్పారు.





