
ప్రపంచం మొత్తం కరోనా కట్టడికి పోరాడుతుంటే.. కొందరు మాత్రం దేశాలను, ప్రజలను విభజించేందుకు ఉగ్రవాదం, అసత్య వార్తలు, నకిలీ వీడియోలను వ్యాప్తిలోకి తెస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. అవి కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్లుగా పోల్చారు. వాటిని వ్యాపింపజేసే పనిలో కొందరు నిమగ్నమయ్యారంటూ పరోక్షంగా పాకిస్థాన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ అలీనోద్యమ కూటమి (నామ్) సదస్సులో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
భారత్కు సొంత అవసరాలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు 123 భాగస్వామ్య దేశాలకు వైద్య ఉపకరణాలు పంపినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. వీటిలో 59 నామ్ దేశాలు ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయంగా వ్యాధుల నివారణ, వ్యాక్సిన్ తయారీలో భారత్ చురుగ్గా తనవంతు పాత్ర పోషిస్తోందని తెలిపారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పొరుగున ఉన్న దేశాలతో సమన్వయం చేసుకుంటూ, వారికి భారతీయ వైద్య నిపుణులు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.





