
తిరుపతి: శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో సీఎం జగన్మోహన్రెడ్డి టీటీడీ ముద్రించిన 2023వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 13 లక్షలు, 6 పేజీల క్యాలెండర్లు 50 వేలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 1.50 లక్షలు, టేబుల్ టాప్ క్యాలెండర్లు 2.50 లక్షలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది. క్యాలెండర్లు, డైరీలు తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లోని టిటిడి సమాచార కేంద్రాల్లో త్వరలో అందుబాటులో ఉంచుతారు.
వాహన సేవలో నాణేలు విసరొద్దని టీటీడీ విజ్ఞప్తి
బ్రహ్మోత్సవాల్లో మాడ వీధుల్లో వాహనసేవల సందర్భంగా వాహనాలపై నాణేలు విసిరేయవద్దని టీటీడీ ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి నాణేలు విసరడం వల్ల అర్చకులు, వాహన చోదకులను బాధించే అవకాశం ఉన్నందున వాటిని నివారించాలని కోరారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు మాస్కులు ధరించాలని, నీటిని ఉంచడానికి తమ సొంత గాజు లేదా స్టీల్ బాటిళ్లను తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టీటీడీ తిరుమలపై ప్లాస్టిక్ నిషేధాన్ని విధించినందున భక్తులు సౌలభ్యం కోసం తమ సొంత ఉక్కు లేదా రాగి లేదా గాజు సీసాలను తీసుకెళ్ళడం మంచిదని ఆయన అన్నారు.





