
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా-పీఎఫ్ఐపై కేంద్ర సంస్థలు మరోమారు గురిపెట్టాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ-ఎన్ఐఏ, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్-ఈడీ మంగళవారం ఉదయం సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఎనిమిది రాష్ట్రాల్లో పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అసోంలో ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్లో కేంద్ర నిఘా సంస్థ-ఐబీ, ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా భాగమైనట్టు ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. మరోవైపు.. కర్ణాటకలో 40 మందికిపైగా అదుపులోకి తీసుకున్నట్టు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు.
పీఎఫ్ఐ లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయడం గత రెండు వారాల్లో ఇది మూడోసారి.సెప్టెంబర్ 22న దేశవ్యాప్తంగా ఎన్ఐఏ విస్తృత సోదాలు నిర్వహించింది. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై 11 రాష్ట్రాల్లోని 106 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేసింది.
కేరళలో అత్యధిక అరెస్టులు జరిగాయి. దాదాపు 22 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక (20), తమిళనాడు(10), అసోం(9), ఉత్తరప్రదేశ్(8), ఆంధ్రప్రదేశ్(5), మధ్యప్రదేశ్(4) , పుదుచ్చేరి, ఢిల్లీ(3) రాజస్థాన్(2)లోనూ పలువురిని అరెస్టు చేసింది.
Source: EtvBharat





