
గుజరాత్ లోని ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి అనంతశ్రీ విభూషిత స్వరూపానందేంద్ర సరస్వతి (99) శివైక్యం చెందారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… మధ్యప్రదేశ్ నర్సింగాపూర్లోని శ్రీధాం జోతేశ్వర్ ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానంద సరస్వతి 1924లో మధ్యప్రదేశ్లోని దిఘోరీ గ్రామంలో జన్మించారు. తొమ్మిదేళ్లకే ఇంటిని వదిలి హిందూ ధర్మ ప్రచార యాత్రలు చేపట్టారు. స్వాతంత్య్ర సంగ్రామంలోనూ పాల్గొన్నారు. శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానంద సరస్వతి అంత్యక్రియలు సోమవారం నిర్వహించే అవకాశం ఉంది.
శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానంద శివైక్యంపై ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీ స్వామీజీ శివైక్యం.. సాధు సమాజానికి తీరని లోటని యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. భారతీయ జ్ఞాన సంప్రదాయాలకు స్వామీజీ చేసిన సేవలు యావత్ ప్రపంచం చిరకాలం గుర్తుంచుకుంటుందని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.





