
* వేలం ద్వారా వచ్చే ఆదాయం ‘నమామి గంగే’ మిషన్ కు
ప్రధాని నరేంద్ర మోడీకి సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా అనేకమంది అందజేసిన కానుకలను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. క్రీడాకారులు, రాజకీయ నేతలు సహా వివిధ వర్గాలు ఆయన్ను కలిసిన పలు సందర్భాల్లో ఇచ్చిన దాదాపు 1200లకు పైగా వస్తువులను వేలం వేయనున్నారు. సెప్టెంబర్ 17న ఈ వేలం ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగ మిషన్ కు అందజేస్తారు. ఈ వేలం ప్రక్రియ pmmementos.gov.in అనే వెబ్ పోర్టల్ ద్వారా నిర్వహించనున్నట్టు మోడ్రన్ ఆర్ట్ నేషనల్ గ్యాలరీ డీజీ అద్వైత గదనాయక్ వెల్లడించారు. ప్రధాని కానుకల వేలం అక్టోబర్ 2తో ముగుస్తుందని, వీటి ప్రారంభధర రూ.100 నుంచి 10లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
వేలం వేసే కానుకల జాబితాలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అందజేసిన రాణి కమలావతి విగ్రహం, యూపీ సీఎం యోగి ఇచ్చిన హనుమాన్ విగ్రహం, సూర్యుడి పెయింటింగ్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ అందజేసిన త్రిశూలం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఇచ్చిన మహాలక్ష్మీ అమ్మవారి విగ్రహం, ఏపీ సీఎం జగన్ ఇచ్చిన వేంకటేశ్వరస్వామి పటం ఉన్నాయి. అలాగే, వీటితో పాటు పతకాలు సాధించిన క్రీడాకారుల సంతకాలతో టీ షర్టులు, బాక్సింగ్ గ్లౌజ్ లు, జావెలిన్, రాకెట్ వంటి క్రీడా సంబంధిత ప్రత్యేక వస్తువులూ ఉన్నాయి. మరోవైపు పలు పెయింటింగ్ లు, శిల్పాలు, హస్తకళలు, జానపద కళాఖండాలు, సంప్రదాయ అంగవస్త్రాలు, శాలువాలు, తలపాగాలు, ఉత్సవ ఖడ్గాలు మొదలైన అనేక వస్తువులు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.





