
-
చైనా ఫోన్ల నిషేధంపై స్పష్టతనిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: చైనా మొబైల్ కంపెనీలు తయారు చేస్తున్న రూ.12 వేలలోపు ఫోన్లను భారత్లో విక్రయించకుండా నిషేధించే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. భారత్ నుంచి ఎగుమతులు కూడా పెంచాలని కూడా దేశంలో తయారీ/అసెంబ్లింగ్ యూనిట్లను నిర్వహిస్తున్న చైనా మొబైల్ సంస్థలకు సూచించారు.
దేశీయ మొబైల్ తయారీ కంపెనీలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో, రూ.12 వేలలోపు చైనా ఫోన్ల విక్రయాలపై భారత ప్రభుత్వం నిషేధం విధించే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో మంత్రి తాజాగా స్పష్టతనిచ్చారు.
చైనా మొబైల్ తయారీ సంస్థలు వ్యాపార కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించేలా చేయడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో దేశీయ కంపెనీలు ప్రధాన పాత్ర పోషించాలని కోరుకుంటున్నామని, అయితే ఇదే సమయంలో విదేశీ బ్రాండ్లు లేకుండా చేయడం తమ ఉద్దేశం కాదని వివరించారు.





