News

ఐరాస భద్రతామండలిలో తొలిసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసిన భారత్

317views

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు వేసింది. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన ఈ ఆరు నెలల్లో మండలిలో ఉక్రెయిన్‌ సమస్యపై జరిగిన ప్రతి ఓటింగ్‌కూ భారత్‌ గైర్హాజరైంది. అది అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలకు ఏమాత్రం రుచించలేదు. ఉక్రెయిన్‌ 31వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు అక్కడ యుద్ధం గురించి సమీక్షించడానికి భద్రతామండలి సమావేశమైనప్పుడు రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు వేసింది.

అది రష్యాకు వ్యతిరేకం కాదు

జెలెన్‌స్కీ ప్రసంగానికి మద్దతుగా ఓటేసినంత మాత్రానా.. భారత్‌ స్టాండ్‌ మారినట్టు కాదని విదేశాంగ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ స్పష్టం చేశారు. స్వేచ్ఛ కోణంలోనే భారత్‌ ఆలోచించిందని, అంతేకానీ.. ఎవరికో వ్యతిరేకంగా ఓటేసినట్టు కాదని ఆయన అన్నారు. గతంలోనూ రెండుసార్లు జెలెన్‌స్కీ యూన్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది మూడోసారి. అందుకు మద్దతుగా భారత్‌ ఓటేసింది. అంతేతప్ప ఇది రష్యాకు వ్యతిరేకంగా ఓటేసినట్లు కాదు.. అసలు అలాంటి ప్రశ్నే లేదు అని ఆయన తెలిపారు.  అలాగే అధికారులు సైతం.. భారత్‌ తీరు మారలేదని.. మారబోదని.. కేవలం జెలెన్‌స్కీ ప్రసంగ సమయంలో భారత్‌ ఓటు కీలకంగా మారినందునా అలాంటి నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి