
న్యూఢిల్లీ: బ్రిటన్ విద్యార్థులు, కంపెనీలు భారత్కు సులభంగా రావడానికి రెండు దేశాల సంబంధాలను పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా మార్చాలని భావిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని అభ్యర్థి రిషి సునాక్ తెలిపారు. కన్జర్వేటివ్ పార్టీలోని భారతీయ బ్రిటిష్ సభ్యులతో లండన్లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రసంగించారు. ”ప్రస్తుతం అధిక ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి, బలమైన, సురక్షితమైన దేశాన్ని నిర్మించడానికి నన్ను ప్రధానిగా ఎన్నుకోండి.
మనం బ్రిటన్-ఇండియాల మధ్య జీవ వారధులం. భారత్లో మన వస్తువులు విక్రయించడానికి, అక్కడ పనులు చేయడానికి మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ.. ఆ దేశం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. బ్రిటన్ విద్యార్థులు అక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరముంది. మన కంపెనీలు, భారతీయ కంపెనీలతో కలిసి పనిచేయాల్సి ఉంది. ఈ కోణంలోనే రెండు దేశాల సంబంధాలను పరస్పర ప్రయోజనకరంగా మార్చాలని అనుకుంటున్నా” అని వివరించారు.





