News

నేతాజీ అస్తికలను భారత్ తీసుకువచ్చే సమయం ఆసన్నమైంది

274views
  • డీఎన్ఏ పరీక్షతో మిస్టరీని ఛేదించాలి

  • సుభాష్ చంద్రబోస్ కుమార్తె డిమాండ్

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ అస్తికలను భారత్‌కు తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని ఆయన కుమార్తె అనితా బోస్‌ పేర్కొన్నారు. 1945, ఆగస్టు 18న ఆయన మరణించగా.. మృతిపై ఇప్పటికీ కొందరికి ఉన్న అనుమానాలకు డీఎన్‌ఏ పరీక్ష సమాధానాలు ఇస్తుందన్నారు.

ప్రస్తుతం జపాన్‌ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉంచిన నేతాజీ అస్తికలకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించేందుకూ జపాన్‌ ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని అనితా బోస్‌ గుర్తుచేశారు. 75వ స్వాతంత్య్ర‌య దినోత్సవాన్ని భారత్‌ ఘనంగా జరుపుకుంటోన్న వేళ.. నేతాజీ కుమార్తె అనితా బోస్‌ ఈ ప్రకటన చేశారు.

‘అస్తికల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి.. అధునాతన సాంకేతికతతో వాటిని విశ్లేషించవచ్చు. 1945 ఆగస్టులో నేతాజీ చనిపోయారని చెబుతున్నా.. వాటిపై కొందరికి అనుమానాలు ఉన్నాయి. రెంకోజీ ఆలయంలో ఉన్న నమూనాలకు డీఎన్‌ఏ పరీక్ష చేయడంవల్ల వారి అనుమానాలను శాస్త్రీయంగా నివృత్తి చేసే వీలు కలుగుతుంది’ అని అనితా బోస్‌ పేర్కొన్నారు.

అటువంటి పరీక్షకు రెంకోజీ ఆలయ పూజారితోపాటు జపాన్‌ ప్రభుత్వం కూడా అంగీకరించిందన్నారు. నేతాజీకి భారత స్వాతంత్య్రం కంటే ఏమీ ఎక్కువ కాదన్న ఆమె.. స్వాతంత్య్ర ఫలాలను భారత్‌ అనుభవిస్తోన్న వేళ వాటిని చూసేందుకు నేతాజీ బతికిలేరన్నారు. ఇటువంటి సమయంలోనైనా కనీసం ఆయన అస్తికలను భారత గడ్డకు తీసుకుచ్చేందుకు కృషి చేద్దామని.. అందుకు ఇదే సరైన సమయమని అనితా బోస్‌ పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి