
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మూడు మొబైల్ కంపెనీలు పన్నులు ఎగవేశాయన్న ఆరోపణలపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు సమాచారం ఇచ్చారు. ఆ కంపెనీలు ఒప్పో, వివో ఇండియా, షియోమీలని ఆమె వివరించారు.
ఒప్పోకు మొత్తం రూ.4389 కోట్ల కస్టమ్స్ సుంకానికి రెవెన్యూ ఇంటలిజెన్స్ విభాగం(డీఆర్ఐ) నోటీసు జారీ చేసింది. కొన్ని వస్తువులకు సంబంధించిన వివరాలను తప్పుగా ఇవ్వడం వల్ల కస్టమ్స్ సుంకం తక్కువగా వచ్చిందని.. మొత్తం మీద పన్ను రూ.2981 కోట్లుగానే కనిపించేలా చేశారని ఆమె తెలిపారు.
కస్టమ్స్ సుంకం కోసం దిగుమతి వస్తువుల విలువను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపడం వల్ల పన్ను ఎగవేత రూ.1408 కోట్ల వరకు ఉండొచ్చని అన్నారు. కంపెనీ స్వచ్ఛందంగా రూ.450 కోట్లు కట్టిందని.. అయితే నోటీసు రూ.4389 కోట్లకు ఇచ్చినట్లు ఆమె గుర్తు చేశారు.
షియోమీకి మూడు షోకాజ్ నోటీసులు జారీ చేశామని.. మొత్తం రూ.653 కోట్ల పన్ను నోటీస్ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. అయితే కంపెనీ రూ.46 లక్షలు మాత్రమే డిపాజిట్ చేసిందన్నారు. వివో ఇండియాకు రూ.2217 కోట్ల పన్ను నోటీసులు పంపగా.. రూ.60 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసినట్లు వివరించారు.





