
కశ్మీర్: అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి మూడు రోజుల ముందు భారత్లోకి చొరబాటుకు ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలు కాల్చిచంపాయి. జమ్ముకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దులో పాక్ భూభాగం నుంచి భారత్లోకి ప్రవేశించేందుకు తీవ్రవాది ప్రయత్నించాడు. బఖూర్పూర్ బీవోపీ(బార్డర్ ఔట్ పోస్ట్) ఏరియాలో అర్ధరాత్రి 12.10 సమయంలో సరిహద్దు వెంబడి అనుమానాస్పద కదిలికలను బీఎస్ఎఫ్ బలగాలు గుర్తించాయి. అక్కడే ఆగిపోవాలని, ముందుకు రావొద్దని ఉగ్రవాదిని బీఎస్ఎఫ్ అధికారులు హెచ్చరించారు.
అయినా ఆలకించకుండా భారత్వైపు మరింత వేగంగా ఉగ్రవాది కదిలాడు. దీంతో చేసేదేమీ లేక బీఎస్ఎఫ్ బలగాలు మూడు రౌండ్ల కాల్పులు జరిపాయి. సోమవారం ఉదయం వెళ్ళి చూడగా సరిహద్దు కంచె పక్కనే ముష్కరుడి మృతదేహాన్ని గుర్తించామని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. అతడి వద్ద ఎలాంటి ఆయుధాలు లభించలేదు. కాగా, తదుపరి దర్యాప్తు కోసం మృతదేహాన్ని పోలీసులకు అప్పగించామని అధికారులు తెలిపారు.





