News

ఉత్తరప్రదేశ్‌లో గుడినే అమ్మేసిన పాకిస్తానీ!

478views
  • ఆలయాన్ని కూల్చి రెస్టారెంట్ నిర్మించిన ముస్లిం

  • కార్పొరేషన్ అధికారుల విచారణలో వెలుగుచూసిన ఘోరం

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ప్రాంతంలోని బెకాన్‌గంజ్‌లో ఉన్న రామ్ జానకీ ఆలయాన్ని పాకిస్తానీ జాతీయుడు విక్రయించాడు. ఆలయంతో పాటుగా అనేక ఇతర ప్రాపర్టీలను కూడా అతడు విక్రయించినట్టు అధికారులు తెలిపారు. అబిద్​ రెహ్మాన్ అనే వ్యక్తి 1962లో పాకిస్తాన్‌కు వలస వెళ్లాడు, అక్కడ అతని కుటుంబం అప్పటికే నివసిస్తోంది. అయితే, 1982లో తిరిగొచ్చిన అబిద్​ రెహ్మాన్ తన ఆస్తిని రామ్ జానకీ ఆలయ సముదాయంలో సైకిల్ రిపేర్ షాపును కలిగి ఉన్న ముఖ్తార్ బాబా అనే వ్యక్తికి విక్రయించాడు.

ఆస్తిని కొన్న ముఖ్తార్​… అక్కడ నివసిస్తున్న 18 హిందూ కుటుంబాలను అక్కడి నుంచి తరలించి, ఓ హోటల్​ను నిర్మించాడు. కాగా, కాన్పూర్​ మున్సిపల్​ కార్పొరేష‌న్‌​ రికార్డుల ప్రకారం ఆస్తి ఆలయంగా నమోదు అయ్యింది. ఈ విషయంపై గతేడాది శత్రు సంపతి సంఘర్షణ సమితి అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

శత్రు ఆస్తుల నిర్వహణ కార్యాలయం…. ఆలయాన్ని, మరో రెండు ఆస్తులను ‘శత్రువు’ ఆస్తిగా చేర్చడానికి ప్రక్రియను ప్రారంభించింది. ఇక, ఆలయాన్ని కొనుగోలు చేసి, కూల్చివేసి హోటల్​ను నిర్మించిన వారికి నోటీసులు జారీచేసినట్టు అధికారులు తెలిపారు. తాము అడిగిన ఐదు నిర్దిష్ట ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు రెండు వారాల సమయం ఇచ్చామన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి స్పందన రాలేదని శత్రు ఆస్తుల విభాగం అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే, ముఖ్తార్ బాబా కుమారుడు మెహమూద్ ఉమర్ తన వద్ద అవసరమైన అన్ని పేపర్లు ఉన్నాయని, నోటీసుపై త్వరలో స్పందిస్తానని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి