News

ప్రపంచ వారసత్వ హోదా దక్కే అవకాశమున్న ‘లేపాక్షి’

639views

అమ‌రావ‌తి: తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన ఒకే ఒక ఆలయం రామప్ప. భవిష్యత్‌లో ప్రపంచ వారసత్వ హోదా వచ్చే అవకాశమున్న మరో ఆశాకిరణం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి (పూర్వ అనంతపురం) జిల్లాలోని లేపాక్షి ఆలయం. రెండు నెలల కిందట యునెస్కో తాత్కాలిక జాబితా (టెంటెటివ్‌ లిస్ట్‌)లో ఈ ఆలయానికి చోటు దక్కింది. ప్రభుత్వం ఇప్పటి నుంచి దృష్టిసారించి పలు చర్యలు తీసుకుంటే రెండు, మూడేళ్ళ‌లో ఈ ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కే అవకాశముంది.

రామప్ప ఆలయం కోసం పనిచేసిన హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్‌ జీఎస్‌వీ సూర్యనారాయణమూర్తి.. తన కన్సెల్టెన్సీ సంస్థ ద్వారా లేపాక్షి ఆలయం కోసం కూడా మూడేళ్ళుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘లేపాక్షి’కి ప్రపంచ వారసత్వ హోదా రావడానికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సూర్యనారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు.

‘‘యునెస్కో గుర్తింపు ఇవ్వడానికి ఆ కట్టడానికి లేదా ప్రదేశానికి ఉన్న ఔట్‌ స్టాండింగ్‌ యూనివర్సల్‌ వాల్యూ (విశ్వజనీనమైన ప్రత్యేకత) చూస్తారు. పెయింటింగ్‌ వేసినట్టు చెక్కిన రాతి శిల్పాలు ఉండటం లేపాక్షి ఆలయం ప్రత్యేకత. 16వ శతాబ్దానికి చెందిన దీన్ని విజయనగర సామ్రాజ్యం పతనం తరవాత అప్పటి ఆలయాల శైలిలో నిర్మించారని తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి