
జమ్ముకశ్మీర్: ఓ జవాన్ వివాహ వేడుక పెద్దలు నిశ్చయించిన సమయానికే సవ్యంగా జరగాలని సంకల్పంచిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) రంగంలోకి దిగింది. జమ్ముకశ్మీర్ మచిల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహిస్తోన్న ఓ జవాన్ పెళ్ళి సమయం దగ్గరపడుతోంది. కానీ, అక్కడి నుంచి బయలుదేరదామంటే వాతావరణం ప్రతికూలంగా ఉంది.
దట్టమైన మంచు అక్కడి నుంచి బయటపడే మార్గాన్ని మూసివేసింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడంతో చీతా హెలీకాఫ్టర్ రంగంలోకి దిగింది. ఒడిశాకు చెందిన 30 ఏళ్ళ నారాయణ బెహెరా బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. మే రెండోతేదీన నారాయణ పెళ్ళి నిశ్చయమైంది. కానీ, రోడ్డు మార్గాన్ని మంచు మూసివేయడంతో అందుబాటులో ఉన్న వాయుమార్గం ద్వారా జవాన్ను శ్రీనగర్ తరలించారు. అక్కడి నుంచి ఒడిశాలోని తన స్వగ్రామానికి వెళ్ళే మార్గంలో ఉన్నాడు జవాన్ నారాయణ.
జవాన్ నారాయణ బెహెరా తల్లిదండ్రులు ఇటీవలే యూనిట్ కమాండర్లతో టచ్లోకి వచ్చారు. తమ కొడుకు ఇంకా బయలుదేరనందున పెళ్ళికి అందుకోలేడేమోననే సందేహాలు వెలిబుచ్చారు. ఇప్పటికే పెళ్ళి ఏర్పాట్లు అన్నీ పూర్తవ్వడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్(కాశ్మీర్ ఫ్రంటియర్) రాజా బాబు సింగ్ దృష్టికి వెళ్ళింది.
శ్రీనగర్లోని చీతా హెలీకాఫ్టర్ ద్వారా నారాయణను తక్షణమే శ్రీనగర్ తరలించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. దీంతో మచిల్ సెక్టార్ నుంచి హెలీకాఫ్టర్ ద్వారా వాయుమార్గంలో శ్రీనగర్ తరలించారు. ప్రస్తుతం ఒడిశాలోని ధెన్కల్ జిల్లా అదిపుర్ గ్రామానికి వెళ్తున్నాడు. నారాయణ సొంత ఊరి నుంచి ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం 2,500 కిలోమీటర్ల దూరంలో ఉందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.





