
-
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
తిరుపతి: తిరుపతిలో టీటీడీ యాత్రికులకు నిర్మించిన శ్రీ పద్మావతి నిలయంలో ఎటువంటి మార్పులు చేయవద్దని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానిని కొత్తగా ఏర్పాటు చేయబోయే బాలాజీ జిల్లా కలెక్టరేట్కు ఇస్తూ కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ పై న్యాయస్థానం విచారణ జరిపింది.
యాత్రికుల విరాళాలతో వచ్చిన సొమ్ముతో పద్మావతి నిలయం ఏర్పాటు చేశారని, అలాంటి భవనాన్ని కలెక్టరేట్ కోసం కేటాయించడం సమంజసం కాదని, నిబంధనలకు విరుద్ధమని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం కలెక్టరేట్ ఏర్పాటుకు ఇచ్చిన ప్రోసీడింగ్స్పై యథాతథస్థితి పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఆ భవనంలో ఎలాంటి మార్పులు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు అదేశాలు జారీ చేస్తూ .. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలతో తిరుపతి కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న శ్రీ బాలాజీ జిల్లాకు కలెక్టరేట్ ను ఏర్పాటు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
Source: Nijamtoday





