
-
ఆ భయంతో భారత ఆర్మీపై అబద్ధాల ప్రచారం!
న్యూఢిల్లీ: భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఎజెండాను ప్రచారం చేసేందుకు కృషి చేస్తోంది కాశ్మీరీ వేర్పాటువాది, ఉగ్రవాది యాసిన్ మాలిక్ పాకిస్తాన్ భార్య ముషాల్ హుస్సేన్ మాలిక్. ఆమె చేస్తున్న అసత్య ప్రచారాలకు సంబంధించిన కథనాలు మరోసారి తెరపైకి వచ్చాయి. యాసిన్ మాలిక్ భార్య భారతదేశాన్ని, భారత ప్రభుత్వాన్ని కించపరచడానికి ఎంతగానో ప్రయత్నిస్తోంది.
డిజిటల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ సెంటర్ కథనం ప్రకారం… పాకిస్థాన్కు చెందిన అనేక మంది ప్రముఖుల ఖాతాలు భారత వ్యవస్థపై బురదజల్లేందుకు ఉపయోగించబడుతున్నాయి. ఈ ఖాతాలన్నీ మాట్లాడే ఏకైక విషయం.. భారతదేశంలోని మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని..! ఈ ఖాతాలన్నీ పాకిస్తానీ ముస్లింలను భారతదేశానికి వ్యతిరేకంగా ప్రేరేపించడమే కాకుండా భారతదేశంలోని ముస్లింలను దేశానికి వ్యతిరేకంగా పోరాడేలా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాయి.
80,000 మంది ఫాలోవర్లను కలిగి ఉన్న యాసిన్ మాలిక్ భార్య, భారతదేశంలో ముస్లింలను ఊచకోత కోస్తున్నారని తన ఖాతా ద్వారా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. కశ్మీరీ ముస్లింలు వేధింపులకు గురవుతున్నారని, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆమె ట్వీట్ చేశారు. ఆమె తన ట్విట్టర్ ఖాతాలో యాసిన్ మాలిక్ ప్రౌడ్ వైఫ్ అని చెప్పుకుంటూ ఉంది.
కశ్మీరీ వేర్పాటువాదులను హీరోలుగా పిలుస్తోంది. ముషాల్ తన భర్త, ఇతర ఉగ్రవాదుల బెయిల్ కోసం ట్వీట్లలో ప్రస్తావన చేస్తూ ఉంది. కశ్మీర్లోని మహిళల ఫోటోలను కూడా ఆమె ఉపయోగించింది. వాస్తవానికి ఈ చిత్రాలకు భారత సైన్యానికి, అణచివేతలకు ఎటువంటి సంబంధం లేదు.
కశ్మీరీ ముస్లింలను హింసించినందుకు భారతదేశాన్ని నిందించడం కొనసాగించింది. యుఎన్కి అనుబంధంగా ఉన్న సంస్థలను ట్యాగ్ చేస్తూనే ఉంది. అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరువు తీయడమే ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. 1989 నుండి కశ్మీర్లో భారత సైన్యం 11,250 మంది మహిళలపై అత్యాచారం చేసిందని, 22,000 మందికి పైగా మహిళలు సైన్యం కారణంగా వితంతువులయ్యారని ఆమె ఒక ట్వీట్లో పేర్కొంది.
ముషాల్ భర్త యాసిన్ మాలిక్తో సహా ఇస్లామిక్ ఉగ్రవాదులు ముందుండి 1990లలో కశ్మీర్ లోయలో హిందువుల మారణహోమం గురించి వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఆదరణను పొందుతున్న సమయంలో ఆమె ఈ పోస్టులు పెడుతుండడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
యాసిన్ మాలిక్పై పలు కేసులు!
కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ మాజీ అధ్యక్షుడు యాసిన్ మాలిక్ 2017లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో అతడిని అరెస్టు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, ఆ తర్వాత హోం మంత్రి ముఫ్తీ సయీద్ కుమార్తె రూబియా సయీద్ను కిడ్నాప్ చేయడం, భారత వైమానిక దళ సిబ్బందిని హతమార్చడం వంటి అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి.
1990లలో కాశ్మీరీ హిందూ మారణహోమానికి నాయకత్వం వహించిన ప్రధాన వ్యక్తులలో ఇతడు కూడా ఉన్నాడు. 2019లో, యాసిన్ మాలిక్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నప్పుడు, అతని భార్య ముషాల్ మాలిక్ పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంది.
Source: NationalistHub





