
ఆఫ్గనిస్థాన్ ప్రజలకు మానవతా సహాయంగా భారతదేశం 2,500 టన్నుల గోధుమలను పంపింది. ఈ మేరకు భారత్ ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్పీ) ద్వారా దాదాపు 50 వేల టన్నుల గోధుమలను సరఫరా చేస్తానని పేర్కొంది. అమృత్ సర్లో జరిగిన ఒక కార్యక్రమంలో అఫ్గాన్ రాయబారి ఫరీద్ మముంద్జాయ్, డబ్ల్యుఎఫ్పీ డైరెక్టర్ బిషో పరాజూలీతో కలిసి గోధుమలను తీసుకువెళుతున్న 50 ట్రక్కుల మొదటి కాన్వాయ్ ను విదేశాంగ కార్యదర్శి హర్ష్ ష్రింగ్లా ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) నుంచి గోధుమలు అఫ్గనిస్థాన్ లోని జలాలాబాద్ కు అత్తారి వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ద్వారా అఫ్గనిస్తాన్ కు రవాణా చేస్తారు.
జలాలాబాద్లోని డబ్ల్యుఎఫ్పికి ఈ సహాయం వివిధ రకాల సరుకులలో పంపిణీ చేయబడుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అఫ్గనిస్తాన్ కు మానవతా సహాయం కోసం ఐక్యరాజ్యసమితి చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం గోధుమలను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అఫ్గనిస్తాన్ లో 50 వేల టన్నుల గోధుమల పంపిణీ చేస్తానని డబ్ల్యూఎఫ్పీతో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అఫ్గాన్ ప్రజలకు సహాయం చేయడానికి రాబోయే రెండు మూడు నెలల్లో పంపబడే అనేక సరుకుల్లో మంగళవారం పంపిన సరుకు మొదటిదని ష్రింగ్లా చెప్పారు.
మముంద్జాయ్ భారత ప్రభుత్వ చొరవను ప్రశంసించారు. ఈ క్లిష్ట సమయంలో అఫ్గనిస్తాన్ కు మద్దతుగా వివిధ దేశాలు చేసిన అతిపెద్ద ఆహార విరాళాలలో అది ఒకటిగా ఉంటుందన్నారు. అయితే అక్టోబర్ 7న పాకిస్తాన్ భూ మార్గాల ద్వారా 50 వేల టన్నుల గోధుమలను ఆఫ్ఘనిస్థాన్ కు పంపే ప్రతిపాదనను భారత్ మొదట చేసింది. కానీ దాని అమలుకై పాకిస్తాన్ తో జరిపిన సుదీర్ఘ చర్చల కారణంగా నాలుగు నెలలకు పైగా వాయిదా పడింది. ఆ తర్వాత ఆఫ్ఘన్ ట్రక్కులలో మాత్రమే గోధుమలను తమ భూభాగం గుండా తరలించాలనే షరతుపై పాకిస్తాన్ ఆ సమస్యను క్లియర్ చేసింది.
భారతదేశం శనివారం ఆఫ్ఘనిస్తాన్ కు 2.5 టన్నుల వైద్య సహాయం, శీతాకాలపు దుస్తులను పంపిన మూడు రోజుల తర్వాత గోధుమల రవాణా ప్రారంభమైంది. ఇరాన్ లోని చబహార్ ఓడరేవు ద్వారా అఫ్గనిస్తాన్ కు మరిన్ని గోధుమలు ఇతర వస్తువులను పంపించే విషయంపై కూడా భారతదేశం దృష్టి సారిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దోల్లాహియాన్ అఫ్గనిస్తాన్ కు మానవతా సహాయాన్ని రవాణా చేయడంలో న్యూ ఢిల్లీకి టెహ్రాన్ సహకరిస్తుందని చెప్పారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత్, అఫ్గనిస్తాన్ ప్రజలతో తన ప్రత్యేక సంబంధానికి కట్టుబడి ఉందని పేర్కొంది.





