
-
కర్ణాటక విద్యాశాఖ మంత్రి నగేష్
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని కేవలం ఎనిమిది విద్యాలయాల్లో మాత్రమే హిజాబ్ వివాదం ఏర్పడిందని ఆ రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖ మంత్రి బిసి నగేష్ తెలిపారు. ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కాగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు గతవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విద్యార్థులు కాషాయం శాలువాలు, స్కార్ఫ్లు, హిజాబ్ ధరించడంతోపాటు ఎటువంటి మతపరమైన పతాకాలను తరగతులలోకి తీసుకెళ్ళరాదని ఆదేశించింది.
అయితే, హిజాబ్, బుర్ఖా ధరించి తరగతులకు హాజరవుతామని కొందరు విద్యార్థినుల గురువారం కూడా పట్టుబట్టడంతో ఈ వివాదం సద్దుమణగడం లేదు. మంత్రి గురువారం విలేఖర్లతో మాట్లాడారు. ఈ సమస్య కేవలం అతి స్వల్ప సంఖ్యలో కొన్ని స్కూళ్లు, కాలేజీలకే పరిమితమైందని చెప్పారు.
ఇలా ఉండగా.. బళ్లారిలోని సరళాదేవి కళాశాలలోకి బుర్ఖా ధరించిన విద్యార్థినులను అనుమతించకపోవడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కాలేజీ ముందు ధర్నా చేశారు. పోలీసులు, న్యాయవాదులు హైకోర్టు ఉత్తర్వులను చూపించి వారిని నచ్చచెప్పి అక్కడ నుంచి పంపివేశారు. అలాగే, ఆంధ్రప్రదేశ్కూ ఈ వివాదం పాకింది.
Source: Nijamtoday





