
న్యూఢిల్లీ: భారత్కు ఐదోసారి అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ వరించింది. ఇంగ్లండ్ జట్టుతో శనివారం జరిగిన ఫైనల్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి.
ఓపెనర్ జాకబ్ బెథెల్(2), కెప్టెన్ టామ్ ప్రెస్ట్(0)లను రవికుమార్ వెంటవెంటనే పెవిలియన్ పంపించాడు. ఓపెనర్ జార్జ్ థామస్ (27), విలియమ్(4), జార్జ్ బెల్(0), అహ్మద్(10)లను రాజ్ బావా ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 61 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను జేమ్స్ రియు తనపై వేసుకున్నాడు. అతనికి జేమ్స్ సేల్స్ (34) అండగా నిలిచాడు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన జేమ్స్ 12 ఫోర్లతో 95 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.
భారత బౌలర్లలో రాజ్ బావ ఐదు, రవికుమార్ నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువ భారత్ 47.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయం సాదించింది. షేక్ రషీద్(50), నిశాంత్ సింధు(50 నాటౌట్), రాజ్ బవా(35)లు రాణించారు.
Source: Nijamtoday





